– ప్రారంభానికి సిద్దం
నవతెలంగాణ – అశ్వారావుపేట
పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాల చిన్నారుల కోసం తెలంగాణ ప్రభుత్వం భవిత భవనాల అభివృద్ధి చేపట్టింది. ఆకర్షణీయంగా పునరుద్ధరణ చేసిన ఈ కార్యాలయాలను సోమవారం నుంచి చేపట్టిన విద్యా వారోత్సవాలు లో ప్రారంభం చేయనున్నారు. జిల్లా లో ఆరు మండలాల్లో పాత భవనాలకు మరమ్మతులు,మరో 17 మండలాలకు కొత్త భవనాల మంజూరు చేసారు. జిల్లాలో ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం చేపడుతున్న భవిత కార్యక్రమానికి మరింత బలోపేతం కల్పిస్తున్నారు. జిల్లాలోని ఆరు మండలాల్లో ఉన్న పాత భవిత భవనాలను ఒక్కోటి రూ.3 లక్షల వ్యయంతో అభివృద్ధి చేసినట్లు అధికారులు తెలిపారు.
అదేవిధంగా జిల్లాలో మరో 17 మండలాలకు కొత్త భవిత భవనాలను మంజూరు చేశారు. ప్రత్యేక అవసరాలు ఉన్న చిన్నారులకు విద్య, శిక్షణ, మార్గదర్శక సేవలు అందించే కేంద్రాలుగా ఈ భవిత భవనాలు ఉపయోగపడనున్నాయి. ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలు సులభంగా నేర్చుకునేలా ఐఈఆర్పీలు నిరంతరం సహకారం అందిస్తున్నారు. పిల్లల అభ్యాస సామర్థ్యాలను పెంపొందించడంతో పాటు వారిలో ఆత్మవిశ్వాసం పెంచే దిశగా కృషి చేస్తున్నారు.



