ఢిల్లీ మద్యం కుంభకోణంలో మాగుంట రాఘవకు బెయిల్‌

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఢిల్లీ మద్యం కుంభకోణంలో నిందితుడిగా ఉన్న ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు మాగుంట రాఘవకు ఢిల్లీ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. అనారోగ్య కారణాలపై మాగుంట రాఘవకు నాలుగు వారాల పాటు న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసింది. అయితే ఈసారి రాఘవకు బెయిల్‌ ఇవ్వడాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) వ్యతిరేకించలేదు. గతంలో ఢిల్లీ హైకోర్టు రాఘవకు బెయిల్‌ ఇవ్వగా, దాన్ని వ్యతిరేకిస్తూ ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. విచారణకు ఎప్పుడు పిలిచినా ఈడీ ముందు హాజరుకావాలని రాఘవను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఢిల్లీ, లేదా చెన్నై కార్యాలయాల్లో విచారణకు హాజరుకావచ్చని తెలిపింది. చెన్నై వదిలి వెళ్లవద్దని ఢిల్లీ హైకోర్టు షరతు విధించింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఫిబ్రవరి 10న రాఘవను ఈడీ అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. సౌత్‌ గ్రూప్‌లో కీలక పాత్రధారిగా రాఘవను ఈడీ పేర్కొంది. ఢిల్లీలో పలు జోన్లకు రాఘవ ప్రాతినిధ్యం వహిస్తున్నారని ఈడీ ఆరోపించింది.

Spread the love