– అధికారులకు సీఎస్ ఆదేశం
– 3న ఎలక్షన్ కమిషన్ అధికారుల రాక
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో అక్టోబర్ 3న కేంద్ర ఎలక్షన్ కమిషన్ అధికారుల పర్యటన సందర్భంగా అన్ని వివరాలతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. ఈసీ అధికారుల రాష్ట్ర పర్యటనకు సంబంధించి చేసిన ఏర్పాట్లపై శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీనియర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిం చారు. ప్రధాన ఎన్నికల కమిషనర్తో పాటు కేంద్ర ఎన్నికల సంఘానికి చెందిన ఇతర సభ్యులు వచ్చే నెల 3 నుంచి మూడు రోజుల పాటు హైదరాబాద్లో పర్యటించనున్నారు. ఈసీ సభ్యులు తమ మూడు రోజుల పర్యటనలో ఎన్ఫోర్స్ మెంట్ ఏజెన్సీలు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు/సీపీలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారులతో సమావేశాలు నిర్వహిస్తారని సీఎస్ తెలిపారు.ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సంబంధిత అంశాలపై క్షుణ్ణంగా అవగా హన కలిగి ఉండాలని, అధికారులు అన్ని వివరాలను ఒకే పద్ధతిలో అందించాలని ఆమె అన్నారు. పోలింగ్ కేంద్రాల్లో కనీస సౌకర్యాల వివరాల ను అందించాలనీ, వికలాంగుల సంక్షేమ శాఖ అధికారులు జిల్లా కలెక్టర్లతో చర్చించి వీల్చైర్లు కొనుగోలు చేసి పోలింగ్ కేంద్రాల వద్ద ఉంచాలని ఆదేశించారు. ఏఈఆర్ఓ/ఈఆర్ఓల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలనీ, సమీకృత సరిహద్దు చెక్పోస్టుల వివరాలను కూడా ఈసీ అధికారులకు అందుబాటులో ఉంచాలని ఆమె తెలిపారు. ఈ సమావేశంలో సీఈవో వికాస్రాజ్ వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.