– అధికారులకు సీఎస్ శాంతికుమారి ఆదేశాలు
నవతెలంగాణ-మైదరాబాద్బ్యూరో
స్వాతంత్ర దినోత్సవ వేడుకలను చారిత్రాత్మక గోల్కొండ కోటలో ఘనంగా నిర్వహించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. మంగళవారంనాడామె డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. డీజీపీ అంజనీ కుమార్, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, హౌమ్ శాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్, ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్ఏఎమ్ రిజ్వి, జీఏడీ కార్యదర్శి శేషాద్రి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్బంగా సీఎస్ మాట్లాడుతూ ఆగస్టు 15న గోల్కొండ కోటలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు జాతీయ పతాకావిష్కరణ చేస్తారనీ, దానికంటే ముందు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో అమర వీరుల స్మారక స్థూపం వద్ద స్వతంత్ర సమర యోధులకు శ్రద్ధాంజలి ఘటిస్తారని తెలిపారు. 15వ తేదీ ఉదయం గోల్కొండ కోటలో ఉదయం 10.30 గంటలకు జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం ఉంటుందని వివరించారు. ఈ వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖలన్నీ పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లోని అమర వీరుల స్మారక స్థూపం వద్ద ఆర్మీ జీఓసీ అధికారులతో సమన్వయం చేసుకొని, తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. పోలీస్, రోడ్లు, భవనాలు, సమాచార శాఖ, జీహెచ్ఎంసీ, విధ్యుత్, రవాణా తదితర శాఖలు తమ శాఖ పరమైన ఏర్పాట్లను చేపట్టాలని అన్నారు. సమావేశంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.