అమెరికాలో భద్రాద్రి రామాలయం..

నవతెలంగాణ భద్రాచలం: భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం తరహాలో అమెరికాలోని అట్లాంటా సమీపంలోని కమింగ్‌ వద్ద రామాలయ నిర్మాణం చేపట్టినట్టు అక్కడ ముఖ్య అర్చకుడిగా వ్యవహరిస్తున్న పద్మనాభాచార్యులు వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు, దాతల సహకారంతో 33 ఎకరాల్లో రూ.300 కోట్లతో ఆలయ పనులు చేపట్టినట్టు ఆయన వివరించారు. తోటి అర్చకులతో భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి ఆలయ ప్రధానార్చకుడు సీతారామానుజాచార్యులతో పాటు కొంతమంది వైదిక పెద్దలను కలిసి సలహాలు తీసుకున్నారు.
అట్లాంటాలో రామాలయ పనులు సాగుతున్నాయని, ప్రధాన కోవెల విడిభాగాలను మాత్రం ఏపీలోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో స్థపతులు నిర్మిస్తున్నారని పద్మనాభాచార్యులు పేర్కొన్నారు. ఆళ్లగడ్డలో పనులు పూర్తయ్యాక అట్లాంటా ప్రాంతానికి విడిభాగాలను విమానంలో తరలిస్తామని తెలిపారు. ఈ ఏడాది ఆగస్టు 17న ఖగోళయాత్రను అయోధ్య నుంచి ప్రారంభిస్తామని పద్మనాభాచార్యులు తెలిపారు. సెప్టెంబరు 17 వరకు యాత్ర సాగుతుందన్నారు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, అర్జెంటీనా, కాలిఫోర్నియా, ఐస్‌లాండ్‌, జపాన్‌, అలస్కా వంటి దేశాలకు విగ్రహాలను ప్రత్యేక విమానంలో తీసుకెళ్లి శాంతి కల్యాణాలు నిర్వహిస్తామని ఆయన వివరించారు.

Spread the love