పాలేరు మాజీ ఎమ్మెల్యేపై భూకజ్జ కేసు

నవతెలంగాణ హైదరాబాద్‌: బంజారాహిల్స్‌లో ఓ స్థలానికి సంబంధించిన వ్యవహారంలో షేక్‌పేట తహశీల్దార్‌ అనితారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బీఆర్ఎస్ పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డిపై బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్‌ రోడ్‌ నం.3లో ప్లాట్‌ నంబరు 8-సీ పేరుతో ఉన్న 2,185 చదరపు మీటర్ల ప్రభుత్వ భూమిని ‘దీప్తి అవెన్యూ ప్రయివేట్‌ లిమిటెడ్‌’ సంస్థకు చెందిన ఉపేందర్‌రెడ్డితో పాటు ఇతరులు కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారు. గతంలో ప్లాట్‌ నం.8-డీలో షౌకతున్నీసా పేరుతో ఉన్న స్థలాన్ని కొనుగోలు చేసిన ఉపేందర్‌రెడ్డి ‘8-సీ’లో స్థలాన్ని తమదిగా చెబుతున్నారు.
ఈ సర్వే నంబరులో మొత్తం 2.25 ఎకరాలు ఉండగా అందులో అత్యధిక భాగం షౌకత్‌నగర్‌ బస్తీగా ఏర్పడగా 2,185 చదరపు మీటర్ల ప్రభుత్వ స్థలం ఖాళీగా ఉంది. ఈ స్థలంలో అవెన్యూ సంస్థ గతంలోనూ నిర్మాణాలు చేపట్టేందుకు ప్రయత్నించగా అప్పటి తహశీల్దార్‌ స్థలాన్ని ప్రభుత్వ అధీనంలోకి తీసుకుని ల్యాండ్‌ బ్యాంక్‌లో ఉంచారు. దీనిపై సంస్థ ప్రతినిధులు కోర్టును ఆశ్రయించగా యథాతథస్థితిని కొనసాగించాలని 2010లో కోర్టు ఆదేశించింది. కాగా, శనివారం తహశీల్దార్‌ అనితారెడ్డి విధుల్లో భాగంగా స్థలాన్ని పరిశీలించగా ప్రభుత్వ భూమి బోర్డు తొలగించి, షెడ్లు నిర్మించి వైన్‌షాప్‌ నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. బంజారాహిల్స్‌ పోలీసుల సహకారంతో శనివారం రాత్రి తహశీల్దార్‌తో పాటు సిబ్బంది అక్కడికి చేరుకొని అక్రమ నిర్మాణాలన్నింటినీ సీజ్‌ చేశారు. తహశీల్దార్‌  ఫిర్యాదు మేరకు మాజీ ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి తదితరులపై ఐపీసీ సెక్షన్లు 447, 427, 467, 468, 471; సెక్షన్‌ 3 ఆఫ్‌ పీడీపీపీ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love