– కేసీఆర్ కుటుంబానికి కాలం చెల్లింది
– రంగులు మార్చే ఊసరవెల్లి కోమటిరెడ్డి
– ప్రజా సమస్యలపై పోరాడే సీపీఐ(ఎం) అభ్యర్థులను ఆదరించాలి : చౌటుప్పల్ రోడ్షో లో మాజీ ఎంపీ పి. మధు
నవతెలంగాణ-చౌటుప్పల్
దేశానికి పట్టిన శని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమని సీపీఐ(ఎం) మాజీ ఎంపీ, ఏపీ మాజీ కార్యదర్శి పి.మధు విమర్శించారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణకేంద్రంలో మునుగోడు సీపీఐ(ఎం) అభ్యర్థి దోనూరి నర్సిరెడ్డి గెలుపు కోసం పట్టణంలో రోడ్డు షో నిర్వహించారు. మహిళల కోలాటాలు, కళాకారుల డప్పు చప్పుళ్లు, ఆటపాటలు, వంద మీటర్ల ఎర్రజెండా చేతబూని కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, మహిళలతో పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. రోడ్డు షో చిన్నకొండూరు చౌరస్తా వరకు కొనసాగింది. జిల్లా కార్యదర్శి ఎమ్డీ జహంగీర్ అధ్యక్షతన నిర్వహించిన బహిరంగసభలో మధు మాట్లాడారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలనకు నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికలతో కాలం చెల్లిపోతుందన్నారు. ప్రజా సమస్యలపై పోరాడే సీపీఐ(ఎం) అభ్యర్థులను గెలిపించాలని, నిజాయితీకి పట్టం కట్టాలని కోరారు. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి రూ.18వేల కోట్ల కాంట్రాక్టుకు బీజేపీకి అమ్ముడుపోయారని.. మునుగోడు ఉపఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులే విమర్శించారని గుర్తుచేశారు. బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన రాజగోపాల్రెడ్డికి మునుగోడు టికెట్ ఇవ్వడం పట్ల ప్రజలు ప్రశ్నించుకుంటున్నారని తెలిపారు. రంగులు మార్చే ఊసరవెల్లి రాజగోపాల్రెడ్డిని చిత్తుగా ఓడించేందుకు మునుగోడు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రజలకు తీరని హామీలు ఇస్తూ మోసం చేస్తున్నాయని, మోడీ ఒక్క ప్రాజెక్టు నిర్మాణం కూడా చేయలేదని విమర్శించారు. పదేండ్ల మోడీ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. నల్లధనం తీసుకువచ్చి ఒక్కొక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానని, ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి విస్మరించారన్నారు. ఐదు లక్షల పరిశ్రమలు మూతపడ్డాయని, లక్షల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారని ఆరోపించారు. గిట్టుబాటు ధర కోసం రైతు ఉద్యమాలు నిర్వహిస్తే మోడీ రైతులపై లాఠీఛార్జి చేయించారని ధ్వజమెత్తారు. కార్మికుల హక్కులను బీజేపీ కాలరాసిందన్నారు. అలాంటి మోడీ ప్రభుత్వానికి కేసీఆర్ వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. దేశంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్కు కాలం చెల్లిందన్నారు. ప్రజలు, కార్మికులు, రైతుల కోసం పోరాటాలు నిర్వహించే కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.
కేంద్రకమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ.. అవకాశవాద, అవినీతి, మతతత్వ పార్టీల అభ్యర్థులను ఓడించాలన్నారు. కమ్యూనిస్టులు నిత్యం పేద ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేయడం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు వచ్చాయని తెలిపారు. రాజగోపాల్రెడ్డికి రాజకీయ విలువలు లేవన్నారు. ఈ ప్రాంత ప్రజల పక్షాన పోరాటాలు చేసే దోనూరి నర్సిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. జిల్లా కార్యదర్శి ఎమ్డీ జహంగీర్ మాట్లాడుతూ.. అనేక అరాచకాలకు పాల్పడిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిని చిత్తుగా ఓడించాలన్నారు. మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్థి దోనూరి నర్సిరెడ్డి మాట్లాడుతూ.. దేప జనార్దన్రెడ్డి, కందాల రంగారెడ్డిని స్ఫూర్తిగా తీసుకొని ఎర్ర జెండా చేతపట్టినప్పటి నుండి ఇప్పటి వరకు దింపలేదన్నారు. ధన బలానికి, జనబలానికి యుద్ధం జరుగుతుందన్నారు. మునుగోడు గడ్డ కమ్యూనిస్టుల అడ్డా అన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు బండ శ్రీశైలం, బూర్గు కృష్ణారెడ్డి, కల్లూరి మల్లేశం, రఘుపాల్, గంగదేవి సైదులు, బండారు నర్సింహ, మేక అశోక్రెడ్డి, ఎమ్డి.పాషా, ఆనగంటి వెంకటేశం, మంగ నర్సింహులు, తదితరులు పాల్గొన్నారు.