– మణిపూర్ జాతుల ఘర్షణకు ప్రధాన కారణం అదే : సీపీఐ పార్లమెంటరీ పార్టీ నాయకులు బినోరు విశ్వం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సహజ సంపద, వనరుల లూటీ చేయాలనే కార్పొరేట్ దురాశకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అందిస్తున్న రాజకీయ అండదండలే మణిపూర్ జాతుల మధ్య ఘర్షణలకు ప్రధాన కారణమని సీపీఐ పార్లమెంటరీ పార్టీ నేత, బినొరు విశ్వం అన్నారు. మణిపూర్ తల్లులు, సోదరీమణులతో దేశమంతా ఉన్నదని ప్రధాని మోడీ పార్లమెంటులో ప్రగల్భాలు పలికారని, కాని ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో ఒక్కసారైనా పర్యటించలేదని విమర్శించారు. బీజేపీ కుటిల, సుంకుచిత రాజకీయాలకు మణిపూర్ ప్రజలు మూల్యం చెల్లిస్తున్నారని, అక్కడ హింసకు ముగింపు ఎప్పుడో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విశాలాంధ్ర పూర్వ సంపాదకులు సి.రాఘవాచారి జయంతిని పురస్కరించుకొని రాఘవాచారి ట్రస్ట్, నీలం రాజశేఖర్ రెడ్డి పరిశోధనా కేంద్రం, సీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ బషీర్బాగ్లో శనివారం ‘మణిపూర్-ఒక రాజకీయ విశ్లేషణ’ అనే అంశంపై సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరైన సదస్సులో బినొరు విశ్వం మాట్లాడుతూ మణిపూర్ ఘర్షణలు ప్రారంభమైనప్పటి నుంచి ప్రధాని మోడీ అనేక దేశాలలో పర్యటించారే తప్ప మణిపూర్ మాత్రం వెళ్ళలేదన్నారు. చివరకు పార్లమెంటులో అవిశ్వాస పరీక్షపై చర్చకు మోడీ సమాధానమిస్తూ మణిపూర్ కోసం భారతదేశం ఉన్నదని ప్రకటించారని, కనీసం ప్రచారం కోసమైన పార్లమెంటు సమావేశాల మరుసటి రోజు మణిపూర్ వెళ్ళి వస్తారని భావించామని, కాని వెళ్ళలేదన్నారు. మణిపూర్ జరుగుతున్నది కేవలం ఆర్థిక, సాంస్కృతిక, జాతుల సంఘర్షణ మాత్రమే కాదని, వీటి వెనుక కార్పొరేట్ ధన దాహం ఉన్నదని విమర్శించారు. ఆదివాసీ ప్రాంతాలైన మణిపూర్ కొండల్లో ఉన్న అపారమైన ఖనిజ సంపదపై అదానీ కన్నుపడిందన్నారు. అందుకే ఆయనకు లాభం చేకూర్చేందుకు బీజేపీ ప్రభుత్వాలు జాతుల ఘర్షణకు తెరలేపాయన్నారు. ఆ రాష్ట్రం గాయాలతో రక్తమోడతున్నదనీ, ఇవి ఎప్పుడు అంతమవుతాయో అనేది ఇప్పటికీ ప్రశ్నలాగే మిగిలిపోయిందన్నారు. ఇరు జాతులు కూడా బీజేపీపై విశ్వాసం కోల్పోయారని అన్నారు. బిజెపి ప్రభుత్వం మోసం చేసిందని, సీఎం ఘర్షణలను నిరోధించడంలో విఫలమయ్యారని ప్రజలు భావిస్తు న్నట్లు తెలిపారు. గతంలో కుకీలు, మైతీలు ఘర్షణ పడినా , కొద్ది రోజులకు సమసి పోయి కలిసిపో యేవారనీ, ఇప్పుడు బీజేపీ కుటిలత్వం కారణంగా ఘర్షణలకు ఎప్పుడు ముగింపో కూడా తెలియడం లేదని విశ్వం అన్నారు. మణిపూర్ ప్రభుత్వం నడుపుతున్నది సహాయక శిబిరాలు కావని, శరణార్థుల శిబిరాలు అని, స్వంత దేశంలోనే మణిపూ ర్ వాసులు శరణార్థులలాగా దుర్భరంగా బతుకులీడు స్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.దేశానికి మణిపూర్ ఒక హెచ్చరిక లాంటిదని, ప్రజలంతా ఏకమై దేశ ఐక్యతను పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకతను చెబుతున్నదన్నారు.
ప్రతిపక్షాల ఐక్యతతోనే తెరపైకి ‘భారత్’
బీజేపీకి విచ్ఛిన్నకర విధానాలకు వ్యతిరేకంగా 28 రాజకీయ పార్టీలు ‘ఇండియా’ పేరుతో కూటమిగా ఏర్పడ్డాయని, దీంతో బీజేపీ ప్రభుత్వం ఏకంగా భారతదేశ పేరును ఇండియా నుండి భారత్ మార్చాలని చూస్తున్నది బినొరు విశ్వం విమర్శించారు. దశాబ్దాలుగా భారతదేశాన్ని ఇండియా అని పిలుస్తున్నారని, అదే సమయంలో భారత్ అని కూడా అంటున్నారని, ఈ రెండు పేర్లలో దేనితోనైనా పిలవొచ్చన్నారు. ప్రతిపక్ష కూటమి పేరు ఇండియా ఉండడంతో పాటు సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ఇష్టానుసారం భారత్ అని మార్చేందుకు ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు. సురవరం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న మణిపూర్ నిత్యం ఘర్షణ మంటలు ఆరడం లేదని విమర్శించారు. మణిపూర్ నుండి, బర్మ, నేపాల్ సరిహద్దుల మధ్య కంచలు కూడా లేవన్నారు. గతంలో తాను మణిపూర్కు వెళ్లినప్పుడు అక్కడి పరిస్థితులను చూసి నిర్ఘాంతపోయానని తెలిపారు. కనీసం రవాణ, రహదారుల సౌకర్యం లేదని, పరిశ్రమలు కూడా లేవని వివరించారు. గతంలో అక్కడ వ్యక్తిగతంగా మాత్రమే ఘర్షణ వాతావరణం ఉండేదని, ఇప్పుడు రెండు జాతుల మధ్య ఘర్షణలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాఘవాచారి సంపాదకీయాలు అద్భుతంగా, విశ్లేషణాత్మకంగా ఉండేవని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఐజేయూ అధ్యక్షులు కె.శ్రీనివాస్ రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఇండియన్ డాక్టర్స్ ఫర్ పీస్ అండ్ డెవలప్మెంట్ (ఐడీపీడీ) ఉపాధ్యక్షులు డాక్టర్ రజినీ తదితరులు పాల్గొన్నారు. సభకు రాఘవాచారి ట్రస్టు ట్రస్టీ బుడ్డిగ జమిందార్ అధ్యక్షత వహించగా, డాక్టర్ అనుపమ ట్రస్టు కార్యకలాపాలను వివరించారు. మాజీ ఎమ్మెల్సీ పీ.జే.చంద్రశేఖర్ రావు వందన సమర్పణ చేశారు.