– ఎన్నికల వేళ… ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్
– 29 మంది మావోయిస్టులు హతం
– మృతుల్లో అగ్రనేత శంకరరావు?
– ముగ్గురు బీఎస్ఎఫ్ జవాన్లకు గాయాలు
దండకారణ్యం కాల్పులతో దద్దరిల్లుతోంది. ఛత్తీస్గఢ్లో ఎటు చూసినా భద్రత బలగాలే..కూంబింగ్ ఆపరేషన్లతో పచ్చని అడవుల్లో రక్తం ఏరులైపారుతోంది. సార్వత్రిక ఎన్నికలకు మూడు రోజులకు ముందు..ఏకంగా 29 మంది మావోయిస్టులు హతం కావటం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు అడవిలో ఎప్పుడు ఏం జరుగుతుందో..ఎక్కడ నుంచి తూటాలు వస్తాయో..తెలియక అడవి బిడ్డలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఎదురు కాల్పుల పేరిట నరమేధం జరుగుతోందని, ఈ రక్త చరిత్రను ఆపాలని పౌరసంఘాలు, మేధావి వర్గాలు ఆందోళనవ్యక్తం చేస్తున్నారు.
నవతెలంగాణ-చర్ల
లోక్సభ ఎన్నికల పోలింగ్కు మూడు రోజుల ముందు ఛత్తీస్గఢ్లో మంగళవారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఎదురు కాల్పుల్లో 29 మంది మావోయిస్టులు హతమయ్యారు. బిఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్, ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. మావోయిస్టులకు గట్టి పట్టున్న బస్తర్ జిల్లాలో ఈ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. మృతుల్లో మావోయిస్టు ఆగ్రనేత శంకరరావు కూడా ఉన్నారని తెలుస్తోంది. ఆయన తలపై రూ.25 లక్షల రివార్డు ఉంది. బస్తర్లో ఈ నెల 19న, కాంకర్లో 26న పోలింగ్ జరగాల్సి ఉంది. ఎన్నికల దృష్ట్యా బస్తర్ జిల్లాలో ఇటీవల 60 వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు.
ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్), జిల్లా రిజర్వ్ గార్డ్ (డీఆర్జీ) బృందాలు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టాయి. గాలింపు కొనసాగుతుండగానే మావోయిస్టులు కాల్పులు జరిపారని, తమ దళాలు వాటిని సమర్ధవంతంగా తిప్పికొట్టాయని బీఎస్ఎఫ్ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఎన్కౌంటర్ అనంతరం ఇన్స్పెక్టర్ జనరల్ సుందర్రాజ్ పాత్రికేయులతో మాట్లాడుతూ సంఘటనా స్థలాన్ని పరిశీలించగా 29 మంది మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయని చెప్పారు. ఎన్కౌంటర్ స్థలంలో పెద్ద ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలు కూడా లభ్యమయ్యాయని తెలిపారు. ఎదురు కాల్పుల్లో గాయపడిన జవాన్లకు ప్రమాదమేమీ లేదని, మెరుగైన చికిత్స కోసం వారిని విమానంలో తరలించామని అన్నారు.
ఎన్కౌంటర్ స్థలం నారాయణ్పూర్ జిల్లాలోని అబూజ్మధ్, మహారాష్ట్రలోని గడ్చిరోలి, ఉత్తర బస్తర్ ప్రాంతాలకు కూడలి అని సుందర్రాజ్ చెప్పారు. సంఘటనా స్థలంలో మావోయిస్టు సీనియర్ నాయకులు లలిత, శంకర్ రావు, రాజు ఉన్నట్లు తమకు సమాచారం ఉందని, దాని ఆధారంగానే డీఆర్జీ, బీఎస్ఎఫ్ సంయుక్త దళాన్ని అక్కడికి పంపామని వివరించారు. మావోయిస్టుల ఉత్తర బస్తర్ డివిజన్లో శంకరరావు, లలిత డివిజనల్ కమిటీ సభ్యులుగా పనిచేస్తున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఎన్కౌంటర్ మృతుల్లో వీరు కూడా ఉన్నారని తెలిసింది.
ఛోటే బెత్రియా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. సంఘటనా స్థలం నుండి మూడు ఎస్ఎల్ఆర్ రైఫిల్స్, ఒక ఏకే రైఫిల్, రెండు పిస్టల్స్, రెండు ఇన్సాస్ రైఫిల్స్, రెండు 303 రైఫిల్స్ వంటి ఆయుధాలు, పేలుడు పదార్థాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయని అధికారులు తెలిపారు. బినగుండ, దాని పరిసర ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలు ఉన్నాయన్న సమాచారంతో డీఆర్జీ, బీఎస్ఎఫ్ దళాలు సోమవారం రాత్రే గాలింపు చర్యలు ప్రారంభించాయి. ‘బినగుండ ప్రాంతంలో ఉత్తర బస్తర్ డివిజనల్ కమిటీకి చెందిన మావోయిస్టులు ఉన్నారని మాకు కచ్చితమైన సమాచారం వచ్చింది. ఈ నెల 5వ తేదీ నుండి ఆ ప్రదేశంలోనే వారు శాశ్వత శిబిరాన్ని ఏర్పాటు చేసుకున్నారు’ అని బీఎస్ఎఫ్ వర్గాలు చెప్పాయి.
రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు జరుగుతున్న సమయంలో గత సంవత్సరం నవంబర్ 7వ తేదీన పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సిబ్బంది వెళుతుండగా మావోయిస్టులు పేలుడు పదార్థాలతో దాడి చేశారు. ఈ ఘటనలో పోలింగ్ సిబ్బందికి ఎస్కార్టుగా వెళుతున్న ఓ జవాను తీవ్రంగా గాయపడి చనిపోయాడు. ఈ పేలుడులో ఇద్దరు పోలింగ్ సిబ్బంది కూడా గాయపడ్డారు. ఈ సంవత్సరం భద్రతా దళాలు మావోయిస్టు వ్యతిరేక కార్యకలాపాలను ముమ్మరం చేశాయి. ఇప్పటి వరకూ 50 మంది కిపైగా మావోయిస్టులను హతమార్చాయి. ఈ ఏడాది జరిగిన మావోయిస్టు హింసలో 18 మంది పౌరులు, ఆరుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. a