బాంబే హైకోర్టు సంచలన తీర్పు .. ప్రొఫెసర్ సాయిబాబా నిర్దోషి

నవతెలంగాణ ముంబయి: మావోయిస్టులతో సంబంధాల కేసు (Maoist links case)లో అరెస్టై.. జీవితఖైదు అనుభవిస్తున్న ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్‌ జి.ఎన్‌. సాయిబాబా (GN Saibaba)ను బాంబే హైకోర్టు (నాగ్‌పుర్‌ బెంచ్‌) మంగళవారం నిర్దోషిగా ప్రకటించింది. ఈ కేసులో ఆయనకు జీవితఖైదు విధిస్తూ సెషన్స్‌ కోర్టు ఇచ్చిన తీర్పును పక్కనబెట్టింది. నిందితులపై ఉన్న ఆరోపణలను రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్‌ విఫలమైనట్లు ధర్మాసనం తెలిపింది. అందువల్ల అభియోగాలను కొట్టివేస్తున్నట్లు వెల్లడించింది. ఈ కేసులో సాయిబాబాతో అరెస్టయిన మరో ఐదుగురిని కూడా నిర్దోషులుగా న్యాయస్థానం పేర్కొంది. ఈ తీర్పుపై స్టే విధించాలని ప్రాసిక్యూషన్‌ కోరలేదు. అయితే దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆశ్రయించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
దేశంపై యుద్ధం చేస్తున్నారని, మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని 2014లో 90% వైకల్యంతో వీల్‌ఛైర్‌కు పరిమితమైన సాయిబాబా, మరో ఐదుగురిని మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఈ కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) చేపట్టింది. 2017లో గడ్చిరోలి సెషన్స్‌ కోర్టు.. నిందితులందరికీ జీవితఖైదు విధించింది. అప్పటి నుంచి సాయిబాబా నాగ్‌పుర్‌ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. అయితే సెషన్స్‌ కోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై 2022 అక్టోబరులో విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం వారిని నిర్దోషులుగా ప్రకటించింది. వెంటనే వారిని జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది. తీర్పు వెలువడిన రోజే మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం.. నిందితుల విడుదలపై స్టే విధించింది. అనంతరం 2023 ఏప్రిల్‌లో మరోసారి విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం.. వీరిని నిర్దోషులుగా ప్రకటిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కనబెట్టింది. వారి అప్పీల్‌పై మళ్లీ మొదట్నుంచీ విచారణ జరపాలని ఉన్నత న్యాయస్థానాన్ని ఆదేశించింది. ఈ క్రమంలోనే విచారణ చేపట్టిన బాంబే హైకోర్టు.. సాయిబాబా సహా మిగతా నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ నేడు తీర్పు వెలువరించింది. కాగా.. అరెస్టు నేపథ్యంలో 2014లో ఆయనను ఢిల్లీ యూనివర్సిటీ సస్పెండ్‌ చేసింది. 2021లో పూర్తిగా విధుల నుంచి తొలగించింది.

Spread the love