దర్యాప్తు మా పద్ధతి ప్రకారం చేస్తాం… సీబీఐ

నవతెలంగాణ – హైదరాబాద్: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైకాపా ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో మరోసారి విచారణ ప్రారంభమైంది. వెకేషన్‌ బెంచ్‌ న్యాయమూర్తి జస్టిస్ ఎం.లక్ష్మణ్ వాదనలు వింటున్నారు. నిన్న ఎంపీ అవినాష్‌ రెడ్డి, వివేకా కుమార్తె సునీత తరఫు న్యాయవాదులు కోర్టుకు వాదనలు వినిపించారు. నేడు సీబీఐ తరఫున ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ అనిల్‌ వాదనలు వినిపిస్తున్నారు. ‘‘అవినాష్ రెడ్డి విచారణకు సహకరించడం లేదు. కేసు దర్యాప్తులో మొదటినుంచీ అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నారు. దర్యాప్తు మా పద్ధతి ప్రకారం చేస్తాం కానీ.. అవినాష్ కోరుకున్నట్లు కాదు. దర్యాప్తును జాప్యం చేసి లబ్ధి పొందాలని చూస్తున్నారు. నోటీసు ఇచ్చిన ప్రతిసారీ ఏదో ఒక కారణం చెప్పి విచారణకు హాజరుకావడం లేదు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఎంతో మందిని విచారించాం.. కొందరిని అరెస్టు చేశాం. మిగతావారికి లేని ప్రత్యేక పరిస్థితి అవినాష్‌కు ఏమిటి?కోర్టుల్లో రకరకాల పిటిషన్లు వేస్తూ అవినాష్ జాప్యం చేస్తున్నారు’’ అని సీబీఐ తనఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సామాన్యుల కేసుల్లోనూ ఇంత సమయం తీసుకుంటారా? వివేకా హత్యకు అనేక ఉద్దేశాలు చెబుతున్నారు.. ప్రధాన కారణమేంటి?అని సీబీఐ తరఫు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై స్పందిస్తూ.. ‘‘రాజకీయ ఉద్దేశాలే వివేకా హత్యకు ప్రధాన కారణం. హత్యకు నెల రోజుల ముందు నుంచే కుట్ర ప్రారంభమైంది. అవినాష్‌ కుటుంబానికి వివేకాతో రాజకీయ విభేదాలున్నాయి’’ అని తెలిపారు. దీనిపై ప్రస్తుతం వాదనలు కొనసాగుతున్నాయి.

Spread the love