నవతెలంగాణ – ఢిల్లీ: దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ కొనసాగుతోంది. 13 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా..పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. గతేడాది తీవ్రస్థాయి ఘర్షణలతో ఉక్కిరిబిక్కిరి అయిన మణిపుర్లోని పలు పోలింగ్ బూత్ల వద్ద భారీగా బలగాలను మోహరించారు.
అలప్పుళ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న కేసీ వేణుగోపాల్ ఓటేశారు. మాజీ క్రికెటర్లు రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే బెంగళూరులో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ బెంగళూరులోని పోలింగ్ బూత్ వద్ద క్యూలో నిల్చొని ఓటు వేశారు. ప్రజలంతా ఎన్నికల ప్రక్రియలో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. తిరువనంతపురం కాంగ్రెస్ అభ్యర్థి శశిథరూర్ లైన్లో నిల్చొని ఓటేశారు. మీరు నమ్మిన వ్యక్తిని ఎంచుకోవడం ముఖ్యమని, అందుకోసం ప్రతి ఒక్కరు పోలింగ్లో పాల్గొనాలని ఓటేసిన అనంతరం ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ అన్నారు. బీజేపీ బెంగళూరు సౌత్ అభ్యర్థి తేజస్వీ సూర్య, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, ఆయన సతీమణి సుధా మూర్తి, కేంద్రమంత్రి, బెంగళూరు నార్త్ అభ్యర్థి శోభా కరంద్లాజె, విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి హర్ష వర్ధన్ శింగ్లా, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ కుటుంబం, పశ్చిమ్ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్, కేంద్రమంత్రి, జోధ్పుర్ అభ్యర్థి గజేంద్ర సింగ్ షెకావత్, బీజేపీ తిస్సూర్, పథనంథిట్ట అభ్యర్థులు సురేశ్ గోపి, అనిల్ ఆంటోనీ ఓటు వేశారు. ‘చిరుత’ బ్యూటీ నేహా శర్మ బిహార్లో, మలయాళీ నటుడు టొవినో థామస్ కేరళలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.