నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణలో జనగణనకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 29న తెలంగాణ గెజిట్లో నోటిఫికేషన్ ప్రచురించనున్నారు. Census 2027లో భాగంగా ప్రజలకు సంబంధించిన మొత్తం 40 రకాల వివరాల సేకరణకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. జనగణనలో భాగంగా ప్రతి వ్యక్తికి సంబంధించిన ప్రాథమిక వివరాలను సేకరించనున్నారు. ఇందులో పేరు, వయస్సు, లింగం, వైవాహిక స్థితి వంటి వివరాలు ఉంటాయి. అలాగే కులం, మతం, ఎస్సీ, ఎస్టీ తదితర వివరాలను కూడా నమోదు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. విద్యార్హతలు, ఉద్యోగం, వృత్తి తదితర వివరాలను కూడా జనగణనలో నమోదు చేయనున్నారు. ఒక వ్యక్తి ఏ రంగంలో పనిచేస్తున్నారు? వారి వృత్తి ఏమిటి? వంటి అంశాలను కూడా సేకరించనున్నారు.
ప్రజల వలసలకు సంబంధించిన సమాచారాన్ని కూడా Census 2027లో నమోదు చేయనున్నారు. అదేవిధంగా ఆధార్, ఓటర్ ఐడీ, పాస్పోర్ట్ వంటి గుర్తింపు పత్రాల వివరాలను నమోదు చేసే అవకాశం ఉంటుందని గెజిట్లో పేర్కొన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? లేదా? అనే వివరాలను కూడా సేకరించాలని గెజిట్లో పేర్కొన్నారు.



