జనగణన ఒక జాతీయ అవసరం

అన్ని వనరుల్లో మానవ వనరు అత్యంత ప్రధానమైనది. దానిని క్రమబద్ధీకరించుకోవడం ఎంతో అవసరం. మానవ వనరుకు సంబంధించిన దశ, దిశ ఎప్పటికప్పుడు స్థిరీకరించుకోవాలంటే దానికి సంబంధించిన సమాచారం క్రమం తప్పని విధంగా సర్వ జనుల కనుసన్నల్లో ఉండాల్సిందే. ఓ దశాబ్దం క్రితం నుండి ‘ప్రివెంటివ్‌ హెల్త్‌ చెకప్‌’ అనే కాన్సెప్ట్‌ బహుళ ప్రాచుర్యంలోకి వచ్చింది. ఆ తర్వాతి నుండి మనుషులు సంవత్సరానికో లేదా డాక్టర్ల సూచన మేరకో మెడికల్‌ టెస్టులన్నీ చేయించుకుని ఏవైనా రుగ్మతలు తలెత్తే ప్రమాదాలు కనపడితే సరైన ట్రీట్‌మెంట్‌ తీసుకోవడం ద్వారా తమ ఆయుః ప్రమాణాలను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ప్రివెంటివ్‌ హెల్త్‌ చెకప్‌ చేయించుకున్న వారిలో 90శాతం మంది అకస్మాత్తుగా సంభవించే గుండెనొప్పి లాంటి ప్రమాదాల నుండి బయటపడుతున్నారట! నిజానికి మోటార్‌ వెహికల్స్‌ సర్వీసింగ్‌కు సంబంధించినంత ఫాలోఅప్‌ మనుషుల ఆరోగ్యానికి లేదు. అలా ఒక క్రమబద్ధమైన ఫాలోఅప్‌ ఉంటే ఆయుఃవృద్ధితో పాటు జీవన ప్రమాణాలు కూడా పెరుగుతాయి. ఇదే రకమైన అంశాన్ని దేశానికి వర్తింపజేస్తే ప్రతిఫలాలు ఎలా ఉంటాయో ఆలోచించండి. కనీసం పదేండ్లకోసారైనా దేశ జనాభాకు సంబంధించిన గణాంకాలన్నీ సేకరించకపోతే భవిష్య ప్రణాళికలు, పథకాలు, విధానాలు, దిద్దుబాటు చర్యలు వంటివన్నీ ఎలా రూపొందించుకుంటాం? కానీ ఈ అంశంపై కేంద్ర పాలనాధికార వ్యవస్థ నిర్లక్ష్యం వహిస్తున్న సంకేతం కనిపిస్తున్నది. రిజిస్టార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా తాజా ఉత్తర్వుల ప్రకారం 2024 జనవరి 1 వరకు అడ్మినిస్ట్రేటివ్‌ బౌండరీలన్నింటిని తటస్తీ కరిస్తున్నట్లు (ఫ్రీజ్‌) ప్రకటించారు. దీంతో ఆ తేదీ వరకు ఏ రకమైన జనాభా లెక్కల ప్రక్రియ మొదలు కాదు అని అర్థమైంది. 2020లో జరగవలసి నటువంటి జనాభా లెక్కలు కరోనా మహమ్మారి కారణంగా వాయిదా వేయబడ్డవి. అయితే ఇదే సమయంలో జనాభా లెక్కలు పూర్తి చేయవలసి ఉన్న అమెరికా చైనా బ్రెజిల్‌ వంటి దేశాలు ఆ పనిని ఇప్పటికే పూర్తిచేశాయి. మన పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌ 2022లో జనగణన పూర్తి చేసింది. 1979లో చివరిసారిగా జనాభా లెక్కలు నిర్వహిం చిన ఆఫ్ఘనిస్తాన్‌ లాంటి అస్తవ్యస్తమైన దేశం తప్ప చాలా దేశాలు ఆ ప్రక్రియను పూర్తి చేశాయి.
భారతదేశంలో యంగ్‌ ఇండియా, అనగా ఎక్కువ మంది యువకులు ఉన్న దేశం, అని చెప్పుకుంటున్నాం. కానీ అనేక స్వచ్ఛంద సంస్థల రిపోర్టుల ద్వారా సమాజంలోని వివిధ అంశాలలో భయపెట్టే వాస్తవాలు బయట పడుతున్నవి. ఉదాహరణ కు పిల్లల్లో పెరుగుతున్న పౌష్టికాహార లోపం, వయసుకు తగ్గ బరువు లేకపోవడం, వయ సుకు మించిన రోగాల బారిన పడడం, నాణ్యమైన విద్యా ప్రమాణాలు గ్రామీణ భారతంలో పూర్తిగా పడిపోవడం, ఫర్టిలిటీ రేటు, వృద్ధాప్య సంరక్షణ వంటివన్నీ ఉన్నవి. జనాభా లెక్కలు అంటే కేవలం మనుషుల సంఖ్య, స్త్రీ పురుష నిష్పత్తి మాత్రమే కాదు. ఏయే ప్రాంతాల్లో ఎంత జనసాంద్రత ఉన్నది వారి జీవన విధానాలు ఎలా ఉన్నవి, ఏయే వృత్తులలో ఎంతమంది నిర్దిష్టంగా ఉన్నారు, నిత్యం పెరుగుతున్న వలసల కారణంగా ఏయే ప్రాంతాలు, రంగాలు ప్రభావితం అవుతున్నవి, క్రమం తప్పని నిర్దిష్టమైన ఆదాయాలు కలిగిన జనాభా ఏప్రాంతంలో ఉన్నది, పూర్తిగా అసంఘటితమైన జనాభా ఎక్కడ ఉన్నది, వారి వెనుకబాటుతనానికి కారణాలేమిటి అనే అనేక అంశాలను ఒడిసి పట్టినప్పుడే కదా కావలసిన దిశా నిర్దేశం చేసుకోవడానికి వీలుంటుంది. వృద్ధులు, వితంతువులు, అనాథలు, స్పెషల్‌ ఛిల్డ్రన్‌గా పిలువబడే వారందరి సమాచారం రాష్ట్రాలు అమలుపరిచే కొన్ని పథకాలు లేకుంటే బయటపడే అవకాశం లేదు. ఈ జనాభా లెక్కల గణాంకాలు కేవలం ప్రభుత్వానికి మాత్రమే కాదు అనేక డిపార్ట్‌మెంట్లకు సంస్థలకు ఈ డేటా ఎంతో ఉపయోగపడుతుంది. ఏయే ప్రాంతాలలో ఎలాంటి కంపెనీలు నెలకొల్పాలి, ఎలాంటి వయసున్న వారికి ఏ విధమైన వస్తు సేవల అవసరాలు ఎక్కడెక్కడ ఉన్నవి అనే అంశాలు ముందస్తుగానే తెలిస్తే కావలసిన విధంగా సంస్థలను నెలకొల్పడానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక పెట్టుబడి మాదిరిగా మానవ వనరు కూడా ఒక చోట స్థిరంగా ఉండటం లేదు. అంచేత పాలనా సౌలభ్యం కోసం నియోజక వర్గాల వునర్వ్యస్థీకరణ, నిధుల కేటాయింపులూ జరగాలి. కాకిలెక్కలు గాకుండా కచ్చితమైన వివరాలుంటే, పోలీసు వ్యవస్థకు కూడా చాలా వెసులుబాటుంటుంది.
1881నుండి భారత దేశంలో జనాభా లెక్కలు ప్రారంభమయ్యాయి. అప్పటినుండి నిరాఘాటంగా కొనసాగిన ఈ ప్రక్రియ రెండవ ప్రపంచ యుద్ధ సమయంలోనూ ఆగిపోలేదు. అలాంటిది ఇప్పుడు తాత్సారం చేయబడుతుంది. కరోనా మహమ్మారి ప్రభావం తగ్గిపోయింది, జనాభా లెక్కల సేకరణకు కావలసినంత యంత్రాంగం ఉన్నప్పటికీ కేంద్ర అధికార సంస్థలు వెనకడుగు వేయడానికి కేవలం రాజకీయ కారణాలే కనిపిస్తున్నవి. జనాభా లెక్కల గడువు ఏర్పడిన తర్వాత సేకరించవలసిన వివరాలపై వివాదాలు మొదలయ్యాయి. ముఖ్యంగా వెనుకబడిన తరగతుల వివరాలను గత 70ఏండ్ల కింద మాత్రమే నమోదు చేశారు. ఆ తర్వాతి కాలాలలో దానిని విస్మరించారు. అంచేత ఇప్పుడు వెనుకబడిన తరగతుల, వివిధ ప్రాంతాల కులాలకు సంబంధించిన డేటా సేకరిం చాలని అనేక రాజకీయ పార్టీలు పట్టుబట్టాయి. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధమైన రిజర్వేషన్లు, నిధుల కేటాయింపులు జరుగుతున్నాయి. వీటిల్లో సమతుల్యత సాధించాలంటే జనాభా లెక్కల వివరాలుండాలి. ”ఒకరు డిమాండ్‌ చేస్తే మేము ఎందుకు చేయాలి” అన్న ధోరణితో దానిని నిరాకరించడమే గాక జనాభా లెక్కల సేకరణని వాయిదా వేస్తూ వస్తున్నారు. ఇది చాలా తప్పు. మాజీ దౌత్యవేత్త, ప్రముఖ రచయిత పవన్‌ కుమార్‌ వర్మ ”ఈ దేశంలో కుల వ్యవస్థ ద్వారా నిర్మితమైన ఆర్థిక జరుగుబాటు ఉన్నది, అందుచేత వీలైనంత మేరా సమాజంలో ఏ రకమైన అంతరాలు ఉన్నవో తెలుసుకుంటే వాటికి పరిష్కారాలు కనుక్కోవడం సులభం” అని అభిప్రాయపడ్డారు. భూమి, ఉత్పత్తి కారకాలు ఇప్పటికీ కొందరి చేతిలోనే బంధీఅయి ఉన్న సందర్భంలో ఇలాంటి గణాంకాలు సేకరించడం వల్ల పరిపాలనకు సౌలభ్యం ఏర్పడుతుంది. కానీ ఇలాంటి లెక్కలు సేకరించిన తర్వాత బయటపడిన వాస్తవాలు రాజకీయంగా కొందరికి తిరోగమన ఫలితాలు ఇస్తాయేమోనన్న భయం పాలకులను వెంటాడుతున్నట్లు ఉంది. ఆదివాసీలు గిరిజనుల రాజకీయ ప్రభావం ఈ మధ్య కాలంలో పెరిగింది. వారికి సంబంధించిన వివరాల్లో మార్పులు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తాయోనన్న భయమూ ఓ కారణమే! మనది మదర్‌ ఆఫ్‌ డెమాక్రసీ అని చెప్పుకుంటున్నారు కాని దానిని డెమాక్రసీ ఆఫ్‌ ఈక్వేషన్స్‌ (అస్థిత్వ సమీకరణల ప్రజాస్వామ్యం)గా ఏనాడో మార్చేశారు. ఎన్నికలకు ముందు రెండేండ్ల నుండే సమీకరణల ఆధారంగా పాలన సాగిస్తే అది నిజమైన ప్రజాస్వామ్యమెలా అవుతుంది. ”కుల వ్యవస్థ కొనసాగాలి కానీ అందులో ఉన్న లొసుగులను మరిచిపోయి అందరూ మతం పేరిట ఐక్యంగా ఉండాలన్న” ద్వంద్వ వైఖరి వల్ల ఇది జరుగుతున్నది. లింగ, కుల, మత, ప్రాంతాల వారిగా ఎవరెవరి ఆర్థిక స్థోమతలేవో తెలిపే సాధనం ఈ జనగణన ప్రక్రియ. జనాభా లెక్కలు సేకరించకుండానే ”ఫలానా మతం వారు బహు భార్యత్వాన్ని పాటిస్తూ వారి జనాభాను విపరీతంగా పెంచుకుంటున్నారు” అనే విధమైన సంకేతాలిస్తూ, కొన్ని జాతులను, మతాలను మినహాయి స్తూనే ఉమ్మడి పౌరస్మృతి ప్రస్తావనను ముందుకు తేవడం విచారకరం. క్రమం తప్పని జనగణన చేయక పోవడం దేశానికి అపకారంతో సమానం. కారణాలేవైనా దీనికి ఒడిగట్టడం నేరం.
జి. తిరుపతయ్య
9951300016

Spread the love