– కజకిస్థాన్ ఇంటర్నేషనల్ చాలెంజ్
అస్థానా (కజకిస్థాన్) : కజకిస్థాన్ ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత వర్థమాన షట్లర్లు సత్తా చాటారు. పురుషుల సింగిల్స్ విభాగంలో తరుణ్ మన్నెపల్లి, మహిళల సింగిల్స్ విభాగంలో అనుపమ ఉపాధ్యాయ విజేతలుగా నిలిచారు. శనివారం జరిగిన ఫైనల్లో మాజీ జూనియర్ వరల్డ్ నం.1 అనుపమ ఉపాధ్యాయ 21-5, 21-16తో ఇషారాణిపై విజయం సాధించింది. ఆల్ ఇండియన్ టైటిల్ పోరులో అనుపమ 41 నిమిషాల్లోనే సహచర షట్లర్పై పైచేయి సాధించింది. 19 ఏండ్ల అనుపమ గతంలో ఇండియా ఇంటర్నేషనల్ చాలెంజ్ 2021, తజకిస్థాన్ ఇంటర్నేషనల్ సిరీస్ 2023, పొలీష్ ఓపెన్ 2022 టైటిళ్లను సైతం సొంతం చేసుకుంది. పురుషుల సింగిల్స్ ఫైనల్లో హైదరాబాద్ ఆటగాడు తరుణ్ మన్నెపల్లి వరుస గేముల్లో గెలుపొందాడు. 22 ఏండ్ల తరుణ్ 21-10, 21-19తో ఎనిమిదో సీడ్ మలేషియా షట్లర్ సూంగ్ జూ వెన్పై విజయం సాధించాడు. జాతీయ చాంపియన్షిప్స్ రన్నరప్ తరుణ్కు ఇదే తొలి అంతర్జాతీయ టైటిల్. మిక్స్డ్ డబుల్స్లో సంజరు శ్రీవాత్స ధన్రాజ్, మనీశ జోడీ 21-9, 7-21, 2-21తో మూడు గేముల టైటిల్ పోరులో రన్నరప్ టైటిల్తో సరిపెట్టుకున్నారు.