– సూపర్కింగ్స్ సూపర్ విక్టరీ
– ఛేదనలో రోహిత్ శతకం వృథా
– చెన్నై 206/4, ముంబయి 186/6
నవతెలంగాణ-ముంబయి
వాంఖడెలో ముంబయి ఇండియన్స్ వరుస విజయాల జోరుకు చెన్నై సూపర్కింగ్స్ చెక్ పెట్టింది. 207 పరుగుల ఛేదనలో ముంబయి ఇండియన్స్ను 186 పరుగులకే కట్టడి చేసిన సూపర్కింగ్స్ 20 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రోహిత్ శర్మ (105 నాటౌట్, 63 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్స్లు) ఛేదనలో అజేయ సెంచరీతో చెలరేగినా.. ముంబయిని ఓటమి నుంచి తప్పించలేకపోయాడు. ఇషాన్ కిషన్ (23), తిలక్ వర్మ (31) రాణించినా.. సూర్యకుమార్ యాదవ్ (0), హార్దిక్ పాండ్య (2), టిమ్ డెవిడ్ (13) విఫలమయ్యారు. 20 ఓవర్లలో 6 వికెట్లకు ముంబయి 186 పరుగులే చేసింది. చెన్నై పేసర్ మతీశ పతిరణ (4/28) నాలుగు వికెట్ల ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అంతకుముందు, తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్కింగ్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 206 పరుగుల భారీ స్కోరు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (69, 40 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్లు), శివం దూబె (66 నాటౌట్, 38 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్లు) అర్థ సెంచరీలతో చెలరేగగా.. ఎం.ఎస్ ధోని (20 నాటౌట్, 4 బంతుల్లో 3 సిక్స్లు) ధనాధన్తో కదంతొక్కాడు. అజింక్య రహానె (5) ఓపెనర్గా నిరాశపరచగా.. రచిన్ రవీంద్ర (21, 16 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) ఎక్కువసేపు క్రీజులో నిలువలేదు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, శివం దూబె మూడో వికెట్కు కీలక భాగస్వామ్యం నమోదు చేశారు. 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 33 బంతుల్లో రుతురాజ్ అర్థ సెంచరీ సాధించగా.. శివం దూబె ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 28 బంతుల్లోనే ఫిఫ్టీ సాధించాడు. డార్లీ మిచెల్ (17) ఫర్వాలేదనిపించాడు. ఆఖరు ఓవర్లో క్రీజులోకి వచ్చిన ఎం.ఎస్ ధోని (20 నాటౌట్) హార్దిక్ పాండ్యపై హ్యాట్రిక్ సిక్సర్లు కొట్టి వాంఖడేను ఉర్రూతలూగించాడు. ధోని మెరుపు హిట్టింగ్తో చెన్నై సూపర్కింగ్స్ 206 పరుగులు చేసింది.