బెంగళూరు: భారత క్రికెట్లో విషాదం నెలకొంది. సీనియర్ స్పోర్ట్స్ కెమెరామన్ కమలనదిముథు తిరువల్లవున్ కన్నుమూశాడు. భారత క్రికెట్ అభిమానులకు సుపరిచితుడైన 57ఏళ్ల ‘తిరు’ మహిళల ప్రిమియర్ లీగ్(డబ్ల్యుపిఎల్)రెండో సీజన్ తొలి మ్యాచ్ను కవర్ చేశారు. శనివారం ఉదయం ప్రాణాలు విడిచినట్లు నిర్వాహకులు తెలిపారు. అతడి మరణవార్త తెలియగానే మాజీ క్రికెటర్లు, కామెంటేటర్లు దిగ్భ్రాంతికి లోనయ్యారు. హర్ష భోగ్లే మాట్లాడుతూ.. ‘ఇదొక షాకింగ్ న్యూస్. ఎల్లప్పుడూ నవ్వుతూ కనిపించే తిరు గొప్ప కెమెరామెన్. భారత కెమెరామెన్లకు ఏమంత గుర్తింపు లేని సమయంలోనే అతడు సొంత ఖర్చుతో మిడ్వికెట్ కెమెరా కొన్నాడు. అతడిని మిస్ అవ్వడం ఎంతో బాధాకరం’ అని అన్నాడు. శుక్రవారం బెంగళూరు వేదికగా జరిగిన ముంబయి ఇండియన్స్-ఢిల్లీ క్యాపిటల్స్ తొలి మ్యాచ్ను తిరు కవర్ చేశాడు.