చైనా నిధులు అబద్ధం

China's funding is a lie– ఢిల్లీ పోలీసుల ఆరోపణలు నిరాధారం
–  ఎఫ్‌ఐఆర్‌ లోని అంశాలను ఖండించిన న్యూస్‌క్లిక్‌
న్యూఢిల్లీ : భారత్‌ వ్యతిరేక ప్రచారం కోసం, దేశ సార్వభౌమత్వాన్ని భంగపరిచేందుకు న్యూస్‌క్లిక్‌కు చైనా నుంచి భారీ మొత్తాల్లో నిధులు వచ్చాయంటూ ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను న్యూస్‌ పోర్టల్‌ న్యూస్‌క్లిక్‌ ఖండించింది. ఢిల్లీ పోలీసుల నమోదు చేసిన ఎఫ్‌ఎస్‌ఐఆర్‌ కాపీ తాజాగా వెలుగుచూసిన నేపథ్యంలో న్యూస్‌ క్లిక్‌ పోర్టల్‌ స్పందించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. తమకెలాంటి నిధులూ రాలేదని, ఢిల్లీ పోలీసులు చేస్తున్నవన్నీ నిరా ధార ఆరోపణలని కొట్టిపారేసింది. మీడియా స్వేచ్ఛా స్వాతంత్య్రాలను హరించే కుట్రగా దీన్ని అభివర్ణిం చింది. చైనా నుంచి గానీ, ఆ దేశానికి చెందిన సంస్థ ల నుంచి గానీ తమకు ఎలాంటి నిధులూ అంద లేదని న్యూస్‌ క్లిక్‌ పేర్కొంది. హింసను ప్రేరేపించ డం, ప్రోత్సహించడం వంటి చర్యలకు తాము పూర్తి గా వ్యతిరేకమని తెలిపింది. వాస్తవిక అంశాలను అందించడమే తమ ఉద్దేశమని, న్యూస్‌క్లిక్‌ ఆన్‌లైన్‌ కవరేజీ చూస్తేనే ఆ విషయం అవగతమవుతుందని స్పష్టం చేసింది.న్యూస్‌క్లిక్‌ వ్యవస్థాపకుడు ప్రబీర్‌ పురకాయస్థ, ఆ సంస్థ మానవ వనరుల విభాగా ధిపతి అమిత్‌ చక్రవర్తిపై ఢిల్లీ పోలీసులు ఉపా కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. న్యూస్‌క్లిక్‌ కు చైనా నుంచి నిధులు అందాయని, కొంత మంది వ్యక్తులతో కలిసి 2019 లోక్‌సభ ఎన్నికల ప్రక్రియను అడ్డుకునేందుకు వీరు ప్రయత్నించారని ఎఫ్‌ఐఆర్‌లో డిల్లీ పోలీసులు పేర్కొన్నారు.
న్యూస్‌క్లిక్‌కు మద్దతుగా కొనసాగుతున్న ఆందోళనలు
పత్రికా సంఘాలు, మానవ హక్కుల సంస్థలు, విద్యార్థి, యువజన సంఘాలు చేపట్టిన ర్యాలీలు, ప్రదర్శనలు దేశ వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ), డెమోక్రటిక్‌ యూత్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డీవైఎఫ్‌ఐ), సీఐటీయూ, ఏఐకేఎస్‌, ఐలు, ఐద్వా, ఏఐఏడబ్ల్యూయూ, జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు జరుగుతున్నాయి. బీహార్‌, అస్సాం, పశ్చిమ బెంగాల్‌లో ఆందోళనలు పెద్ద ఎత్తున జరి గాయి.వందలాది మంది జర్నలిస్టులు, హక్కుల కార్య కర్తలు, రాజకీయ నేతలు సంఘీభావం తెలిపారు.
30 దేశాల నుంచి సంఘీభావం
ప్రబీర్‌, చక్రవర్తిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌
న్యూస్‌క్లిక్‌కి అంతర్జాతీయ మద్దతు లభించింది. న్యూస్‌క్లిక్‌ జర్నలిస్టులపై దాడి, అరెస్టును, అణచివేత ను ఖండిస్తూ ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, కళాకారులు, విద్యావేత్తలు న్యూస్‌క్లిక్‌కు మద్దతు తెలిపారు. ఈ మేరకు సంతకాలు చేసి ప్రకటన విడుదల చేశారు. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం కింద అరెస్టై, పోలీసు కస్టడీలో ఉన్న న్యూస్‌క్లిక్‌ ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌ ప్రబీర్‌ పుర్కాయస్థ, నిర్వాహకుడు అమిత్‌ చక్రవర్తిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.ఈ లేఖపై రాజకీయ నేతలు ఎస్బు జికోడ్‌, మాక్యఫిలి, దక్షిణాఫ్రికాలోని కుటీర నివాసితుల ఉద్యమ నేతలు మొహాపి, సిన్‌ ఫెయిన్‌ ఎంపి క్రిస్‌ హజార్డ్‌, దక్షిణాఫ్రికా కమ్యూనిస్ట్‌ పార్టీ సెక్రటరీ జనరల్‌ సోలీ మపైలా, బ్రియాన్‌ బెకర్‌, ఎగ్జిక్యూటివ్‌ సంతకం చేశారు. జాకోబిన్‌ మ్యాగజైన్‌ వ్యవస్థాపకుడు, ది నేషన్‌ ప్రెసిడెంట్‌ భాస్కర్‌ సుంకర, ది ఎంపైర్‌ ఫైల్స్‌కు చెందిన అబ్బి మార్టిన్‌, మైక్‌ ప్రిస్నర్‌, ది ఇన్‌సైట్‌ వార్తాపత్రిక మేనేజింగ్‌ ఎడిటర్‌, పాన్‌ ఆఫ్రికన్‌ టెలివిజన్‌ వ్యవస్థాపకుడు క్వేసి ప్రాట్‌ జూనియర్‌ వంటి ప్రఖ్యాత పాత్రికేయులు, రచయితలు సంతకం చేశారు. లాస్‌ ఏంజెల్స్‌లోని చరిత్రకారుడు, జర్నలిస్ట్‌, ది మార్నింగ్‌ స్టార్‌ సంపాదకులు బెన్‌ చాకో, రోజర్‌ మెకెంజీ, హాస్యనటుడు, జర్నలిస్ట్‌ లీ క్యాంప్‌ ఆఫ్‌ డేంజరస్‌ మైండ్స్‌, రానియా ఖాలెక్‌, యూజీన్‌ పురియర్‌ ఆఫ్‌ బ్రేక్‌త్రూ న్యూస్‌ సంతకాలు చేశారు. వికీలీక్స్‌ జూలియన్‌ అసాంజే సహ వ్యవస్థాపకుడు గాబ్రియేల్‌ షిప్టన్‌ కూడా భారతదేశంలో పత్రికా స్వేచ్ఛపై దాడులను తిరస్కరిస్తూ లేఖపై సంతకం చేశారు.
అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బెనిన్‌, బొలీవియా, బ్రెజిల్‌, కెనడా, చిలీ, చైనా, క్రొయేషియా, క్యూబా, ఈక్వెడార్‌, ఈజిప్ట్‌, జర్మనీ, గ్వాటెమాల, హైతీ, ఇండియా, ఐర్లాండ్‌, ఇటలీ, జమైకా, కెన్యా, లెబనాన్‌, మలేషియా, మెక్సికో, పెరూ, ప్యూర్టో రికో, రష్యా, దక్షిణాఫ్రికా, స్వీడన్‌, ట్రినిడాడ్‌ మరియు టొబాగో, యూకె, యూఎస్‌, వెనిజులాతో సహా 30 దేశాల నుండి సంతకం చేసినవారు ఉన్నారు. అక్టోబర్‌ 3న న్యూస్‌క్లిక్‌, వేధింపులకు గురైన, నిర్బంధానికి గురైన వారికి మద్దతు, సంఘీభావం వెల్లువెత్తుతున్న నేప థ్యంలో అంతర్జాతీయ మద్దతు రావడం గమనార్హం. న్యూస్‌క్లిక్‌ ప్రజాస్వామ్యాన్ని బలపరిచే మీడియా ఔట్‌లెట్‌, ఇది వెలుగును ప్రకాశిస్తుందని పేర్కొన్నా రు. గౌరవం, మార్పు కోసం నినదిస్తుందని, సమా జంలోని అట్టడుగు, అణచివేతకు గురవుతున్న రంగా లవారి వాణిని వినిపిస్తున్నదని తెలిపారు. అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.
కేరళలో న్యూస్‌క్లిక్‌ మాజీ జర్నలిస్ట్‌ ల్యాప్‌టాప్‌, ఫోన్‌ స్వాధీనం చేసుకున్న ఢిిల్లీ పోలీసులు
సీపీఐ(ఎం) ఢిల్లీ కార్యదర్శి తెలుసా? అంటూ ప్రశ్నలు
కేరళలో న్యూస్‌క్లిక్‌ మాజీ జర్నలిస్ట్‌ ల్యాప్‌టాప్‌, ఫోన్‌ను ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ పోలీసు స్పెషల్‌ సెల్‌ బృందం పత్తనంతిట్టలోని న్యూస్‌క్లిక్‌ మాజీ జర్నలిస్ట్‌ అనూషా పాల్‌ ఇంట్లో సోదాలు నిర్వహించారు. న్యూస్‌క్లిక్‌కు ఫండింగ్‌ గురించి, సంస్థతో ఉన్న సమయంలో ఆమె రిపోర్టింగ్‌ అసైన్‌మెంట్‌ల గురించి వారు ప్రశ్నించారు. సీపీఐ(ఎం) ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి కె.ఎం తివారీ తెలుసా? అని పోలీసులు అడిగారని ఆమె మీడియాకు తెలిపారు.
పోలీసులు తన ల్యాప్‌టాప్‌, మొబైల్‌ ఫోన్‌ను కూడా తీసుకువెళ్లారని, వీలైనంత త్వరగా న్యూఢిల్లీలోని తమ కార్యాలయానికి హాజరు కావాలన్నారని ఆమె చెప్పారు. ఆమె 2018 నుంచి 2022 వరకు న్యూస్‌క్లిక్‌ కోసం పనిచేశారు. ప్రస్తుతం వికలాంగుల హక్కుల కోసం జాతీయ వేదిక రిసెర్చర్‌గా ఉన్నారు. న్యూస్‌క్లిక్‌పై దాడిని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఖండించారు. ఇది స్వతంత్ర పత్రికలను ఇబ్బంది పెట్టడానికి ఉద్దేశించిన ఫాసిస్ట్‌ చర్య అని విమర్శించారు.

Spread the love