ఆ సంఘం అవిర్భావ కార్యక్రమంలో పాలడుగు భాస్కర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కార్మిక హక్కుల సాధన కోసం ఐక్యత, పోరాటం అనే నినాదంతో సీఐటీయూ పని చేస్తున్నదని వక్తలు తెలిపారు. సీఐటీయూ 56వ అవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం హైదరాబాద్లోని ఆ సంఘం రాష్ట్ర కార్యాలయం వద్ద సీఐటీయూ సీనియర్ నాయకులు పి రాజారావు జెండాను అవిష్కరించారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ సీఐటీయూ 1970 మే 30న ఏర్పడిందని చెప్పారు. 56ఏండ్ల కాలంలో అనేక చారిత్రాత్మకమైన పోరాటాలు నిర్వహించిందని వివరించారు. సంఘటిత, అసంఘటిత, స్కీమ్ వర్కర్ల సమస్యలపై అనేక పోరాటాలు చేసిందని గుర్తు చేశారు. కార్మికులకు ఏ సమస్య వచ్చినా ముందుండి పోరాటం చేసేది సీఐటీయూ మాత్రమేనని స్పష్టం చేశారు. ఈ క్రమంలో మెరికల్లాంటి అనేక మంది కార్యకర్తలు, నాయకులు అమరులయ్యారని గుర్తు చేశారు. పోలీసు నిర్భందం, గుండాల దాడులు, పారిశ్రామిక యజమానుల దౌర్జన్యాలను ఎదుర్కొన్నదని తెలిపారు. సామాజిక పరివర్తన కోసం, దోపిడీని అంతం చేసేందుకు దార్శనికతతో సీఐటీయూ రాజీలేని వర్గ పోరాటాలు నిర్వహిస్తున్నదని స్పష్టం చేశారు.
దేశంలోని కార్మిక వర్గం జీవన పరిస్థితులపై పెరుగుతున్న దాడుల పట్ల అసంతృప్తి, కోపంతో రగిలిపో తున్నారన్నారు. మూసివేతలు, ఉద్యోగ నష్టాలు, పెరుగుతున్న కాంట్రాక్టరైజేషన్, సామూహిక బేరసారాల హక్కులు, సామాజిక భద్రతా ప్రయో జనాల తిరస్కరణ మొదలైన వాటి ఫలితంగా దేశంలో వివిధ ప్రాంతాల్లో, వివిధ రంగాల్లో పోరాటాలు సమ్మెలు చెలరేగుతున్నాయని గుర్తు చేశారు. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లతో కార్మిక హక్కులను కాలరాస్తున్నదని విమర్శించారు. కార్మిక వర్గం గొంతునొక్కాలని నిర్భంధాన్ని ప్రయోగిస్తే… బంతిని గోడకేసి కొడితే..తిరిగి అదే వేగంతో వస్తుందని హెచ్చరించారు. అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి. వెంకట్ మాట్లాడుతూ కార్మిక వర్గ హక్కుల పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువల రక్షణ, మత సామరస్య పరిరక్షణ, సామాజిక న్యాయం సాధన అనే మహత్తర లక్ష్యాలతో సీఐటీయూ ఏర్పడిందని చెప్పారు. దేశ కార్మిక ఉద్యమ చరిత్ర ఒక మైలు రాయిగా నిలిచిందన్నారు. కేవలం వేతనాల పెంపు, నియమాల పరిరక్షణ కోసం మాత్రమే కాకుండా, కార్మిక కర్షక వర్గ ఐక్యతతో సమాజ మార్పు దిశగా చైతన్య పరిచే శక్తిగా ఎదిగిందన్నారు. 1970కు ముందే జాతీయ ఉద్యమంలోనూ, ఆ తర్వాత స్వదేశీ పాలక వర్గం పట్ల అప్రమత్తంగా ఉండాలని నినదించిందని గుర్తు చేశారు. దేశంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై మరింత సమరశీల పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
క్విట్ ఇండియా పోరాట స్ఫూర్తితో వచ్చే నెల 10న పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించనున్నట్టు తెలిపారు. సీఐటీయూ సీనియర్ నాయకులు పి రాజారావు, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్బాబు, బెఫీ ప్రధాన కార్యదర్శి వెంకట్రామయ్య, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్వీ రమ మాట్లాడుతూ కార్మికులు కేవలం తన పని స్థలంలో వచ్చిన సమస్యలతో పరిమితం కాకుండా దేశ రాజకీయాలు, ఆర్థిక విధానాలు, సామాజిక మార్పులపై అవగాహన కల్పిం చేందుకు సీఐటీయూ కృషి చేస్తున్నదని చెప్పారు. కార్మిక వర్గంపై, ప్రజా ఉద్యమాలపై నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎమర్జన్సీని ప్రకటించి అత్యంత దారుణంగా నిర్భంధించిందని గుర్తు చేశారు. అంతకంటే దారుణంగా నేటి బీజేపీ ప్రభుత్వం హక్కులను హరిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. పోరాటాలతోనే పాలక వర్గ విధానాలను ఓడించగలమని చెప్పారు. అందుకు కార్మిక వర్గం ఐక్యత, పోరాటం అనే నినాదంతో సీఐటీయూ పని చేస్తున్నదని గుర్తు చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శులు జె వెంకటేశ్, వీఎస్ రావు, పి శ్రీకాంత్, కూరపాటి రమేష్, పద్మశ్రీ, ఎం వెంకటేశ్, సీఐటీయూ నగర అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు ఎం దశరథ్, జె కుమారస్వామి, నాయకులు సందీప్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
కార్మిక హక్కుల సాధనే సీఐటీయూ లక్ష్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



