జైలులో ఘర్షణ.. ఇద్దరు ఖైదీలు మృతి..

నవతెలంగాణ – చండీగఢ్‌: జైలులో ఖైదీల మధ్య ఘర్షణ.. ఈ ఘర్షణలో ఇద్దరు ఖైదీలు మరణించారు. మరో ఇద్దరు ఖైదీలు గాయపడ్డారు. పంజాబ్‌లోని సంగ్రూర్‌లో జైలులో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం రాత్రి 7 గంటలకు నలుగురు ఖైదీలను ఒక సెల్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఆ బ్యారక్‌లోకి ప్రవేశించిన తొమ్మిది మంది ఖైదీలు పదుపైన ఆయుధాలతో ఆ నలుగురు ఖైదీలపై దాడి చేశారు. కాగా, ఖైదీల మధ్య ఘర్షణను నివారించేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ సంఘటనలో ఇద్దరు ఖైదీలు మరణించగా మరో ఇద్దరు ఖైదీలు గాయపడ్డారు. మృతులను హర్ష్‌, ధర్మేందర్‌గా‌, గాయపడిన వారిని గగన్‌దీప్‌ సింగ్‌, మహ్మద్‌ సెహ్వాజ్‌గా గుర్తించారు. మరోవైపు గాయపడిన ఖైదీలను సంగ్రూర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే మెరుగైన చికిత్స కోసం వారిని పాటియాల ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్‌ చేశారు. నలుగురు ఖైదీలపై తొమ్మిది మంది ఖైదీలు ఎందుకు దాడి చేశారో అన్నదానిపై జైలు అధికారులు, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love