నీట్ కుంభకోణానికి ముగింపు పలకాలి : సీఎం స్టాలిన్

నవతెలంగాణ – హైదరాబాద్: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) కుంభకోణానికి ముగింపు పలకాలని తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే నేత ఎంకే స్టాలిన్ శుక్రవారం అన్నారు. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సీఎం స్టాలిన్ మాట్లాడుతూ.. ఎవరూ మన దగ్గర దోచుకోలేని ఏకైక ఆస్తి చదువు. కానీ అందులోనూ నీట్ లాంటి మోసాలు ఉన్నాయి. అందుకే దీన్ని వ్యతిరేకిస్తున్నాం. నీట్ లో అక్రమాలు జరుగుతున్నాయని తమిళనాడు తొలుత చెప్పింది.. ఇప్పుడు దేశం మొత్తం దీనిని సమర్ధిస్తోంది. ఎటువంటి ఆర్థిక, రాజకీయ పరిస్థితులు విద్యార్థుల చదువుకు అడ్డంకి కాకూడదన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోషల్ మీడియా పోస్ట్లో “నీట్ అభ్యర్థుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు కేంద్రప్రభుత్వం కట్టుబడి ఉంది. విద్యార్థులు దేనికోసం ఆందోళనలు చేపడుతున్నారో వాటిని న్యాయంగా పరిష్కరిస్తామని నేను వారికి హామీ ఇస్తున్నాను. ఏ విద్యార్థికీ నష్టం జరగదు. వారి భవిష్యత్తు ప్రమాదంలో పడదు” అని వ్యాఖ్యానించారు. 2024లో నీట్-యూజీ 1,563 ఇచ్చిన గ్రేస్ మార్కులను తీసేస్తామని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. జూన్ 23న వారికి మళ్లీ పరీక్ష రాసే అవకాశాన్ని కల్పిస్తామని పేర్కొంది.

Spread the love