రాష్ట్ర వ్యాప్తంగా సీపీఐ(ఎం) నిరసన
నవతెలంగాణ – విలేకరులు
కేరళం మాజీ ముఖ్యమంత్రి, సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు పినరయి విజయన్పై కేంద్ర ప్రభుత్వం ఈడీని రాజకీయ ఆయుధంగా ఉపయోగిస్తూ దాడులు చేయడాన్ని ఆ పార్టీ తీవ్రంగా ఖండించింది. రాష్ట్ర వ్యాప్తంగా గురువారం నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఈడీలకు బేడీలకు బెదరం.. మచ్చలేని కమ్యూనిస్టు నాయకుడు పినరయి విజయన్.. దేశంలో ప్రశ్నించే గొంతుకలను అణచివేయడం సాధ్యం కాదు.. అంటూ నినాదాలు చేశారు.హనుమకొండ జిల్లాలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. జనగామ జిల్లా కేంద్రంలో ప్లకార్డులు పట్టుకుని కేంద్రానికి, ఈడీకి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. రఘునాథపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన తెలిపారు. బచ్చన్నపేటలోని జనగామ- సిద్దిపేట రోడ్డుపై కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో ప్లకార్డ్స్తో నిరసన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈడీ దాడులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కరీంనగర్, ఖమ్మం, ఉమ్మడి మెదక్ జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు.నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. తాడూర్, అచ్చంపేట మండల కేంద్రాలు, వనపర్తి, మహబూబ్నగర్ జిల్లా కేంద్రాల్లోని అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసన తెలిపారు. కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఇంటిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేపట్టిన దాడులను నిరసిస్తూ యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని జాతీయ రహదారిపై నిరసన తెలిపారు.



