నవతెలంగాణ – కోల్కతా: భారీ హింసాత్మక ఘటనల మధ్య జరిగిన పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. అసాధారణ భద్రత నడుమ రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. 2024 జనరల్ ఎలక్షన్స్కు కొన్ని నెలల ముందు పంచాయతీ ఎన్నికలు జరగడంతో అధికార టీఎంసీ, ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. దీంతో పెద్ద ఎద్దున హింస చెలరేగింది. రాజకీయ ఘర్షణల్లో 40 మందికిపైగా మరణించారు. బ్యాలెట్ బాక్సులు ఎత్తుకెళ్లడం, బాలెట్ పేపర్లకు నిప్పంటించడం, చెరువుల్లో పడేయడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇక పరస్పర దాడుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మూడంచెల పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 6100కుపైగా పోలింగ్ బూతుల్లో ఈ నెల 8న పోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా 80.71 శాతం పోలింగ్ నమోదయింది. అయితే పలుచోట్ల హింసాత్మక ఘటనలు జరుగడంతో 19 జిల్లాల్లోని 696 బూత్లలో సోమవారం రీ పోలింగ్ జరుగగా 69.85 శాతం మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు.