Monday, May 4, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుమంటలో పంటలు

మంటలో పంటలు

- Advertisement -

షార్ట్‌ సర్క్యూటే కారణం
పలుచోట్ల ఇదే తరహా ప్రమాదాలు
లబోదిబోమంటున్న రైతులు
నవతెలంగాణ – చొప్పదండి/బిజినేపల్లి/రాయపోల్‌/మద్దూరు/కామారెడ్డి/ బాన్సువాడ

రాష్ట్రంలో పలుచోట్ల అగ్నిప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఎక్కువగా పంటలకు నిప్పు అంటుకుని కాలిపోయాయి. రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. కరీంనగర్‌ జిల్లా చొప్పదండి మండల కేంద్రంలో కరెంటు షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు లేచి రెండెకరాల మొక్కజొన్న పంటకు నష్టం వాటిల్లింది. చొప్పదండి పట్టణానికి చెందిన గోస్కుల శంకర్‌కు చెందిన రెండెకరాల మొక్కజొన్న పంటచేను పైనుంచి వెళ్తున్న 11కేవీ వైర్లు గాలికి ఒకదానికొకటి తాకి షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు లేచాయి. దీంతో మక్క చేనుకు మంటలు అంటుకున్నాయి. స్థానిక రైతులు ఫైర్‌ స్టేషన్‌కు సమాచారం అందించగా, ఫైర్‌ ఇంజన్‌ వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేసిన లాభం లేకుండా పోయింది.

ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి నిప్పు రవ్వలు పడి మొక్కజొన్న పంట దగ్ధమైన ఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి మండల పరిధిలోనిఅల్లిపూర్‌ గ్రామంలో రైతు డొక్కా శ్రీనివాసులు. తనకు ఉన్న 2.10 గుంటల సాగుభూమిలో మొక్కజొన్న పంటను వేశాడు. ట్రాన్స్‌ఫారం నుంచి మంటలు రావడంతో స్థానికులు గమనించి రైతుకు సమాచారమిచ్చారు. అతను వచ్చేసరికి పంట అంతా కాలి బూడిద అయింది. దీంతో సుమారు రెండు లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగినట్లు రైతు తెలిపారు.

రాయపోల్‌ మండలంలోని చిన్నమాసాన్‌పల్లి గ్రామానికి చెందిన గూని స్వామి, సొక్కం కిష్టయ్యలకు చెందిన సుమారు 120 మోపుల గడ్డి ప్రమాద వశాత్తు మంటలతో పూర్తిగా కాలిపోయింది. ఎండుగడ్డి ఎక్కువగా ఉండడం, మధ్యాహ్న సమయంలో ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి.గమనించిన స్థానికు లు మంటలను ఆర్పేందుకు స్థానికులు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపో వడంతో వెంటనే అగ్నిమాపక సిబ్బంది, మండల పోలీస ులకు సమా చారం అందించారు. గాగిల్లాపూర్‌ గ్రామంలో మేక లక్ష్మణ్‌కు చెందిన 160 పశుగ్రాసం కట్టలు ప్రమాదవశాత్తు విద్యుద్ఘాతంతో దగ్ధమైంది.

కామారెడ్డిలో 18 దుకాణాలు దగ్ధం
కామారెడ్డి జిల్లా కేంద్రంలో శనివారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పూల, పండ్ల దుకాణాలు, చిన్నపాటి హోటళ్లు సుమారు 18 వరకు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనతో చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపోయి జీవనోపాధిని కోల్పోయారు. ఈ ప్రమాదంతో సుమారు రూ.50లక్షల వరకు ఆస్తినష్టం వాటిల్లినట్టు బాధితులు తెలిపారు. కామారెడ్డి పట్టణంలోని ఇందిరాచౌక్‌ వద్ద దుకాణాల పక్కనే ట్రాన్స్‌ఫార్మర్‌ సమీపంలో శనివారం అర్ధరాత్రి తర్వాత మంటలు వేగంగా వ్యాపించి వరుసగా దుకాణాలను కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అప్పటికే అన్ని దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. దుకాణాల పక్కనే ట్రాన్స్‌ఫార్మర్‌ సమీపంలో చెత్తాచెదారం పేరుకుపోయి ఉంటుంది. దానిని ప్రతిరోజూ ఎప్పటికప్పుడు తొలగించకపోవడం వల్లే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని ప్రజలు ఆరోపిస్తున్నారు.

లారీ బాడీ బిల్డింగ్‌ వర్క్‌షాప్‌లో…
బాన్సువాడ పట్టణ కేంద్రంలోని తాడ్కోల్‌ రోడ్డులో ఓ లారీ బాడీ బిల్డింగ్‌ గ్యారేజీలో ఆదివారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం చోటుచేసు కుంది. గ్యారేజీలో ఉన్న కట్టెలకు మొదట మంటలు అంటుకున్నాయి. దీంతో క్షణాల్లోనే మంటలు గ్యారేజీలో ఉన్న ఇతర సామన్లకు వ్యాపించాయి. పొగలు, మంటలు పెద్దఎత్తున రావడంతో స్థానికులు వెంటనే అప్తమత్తమై స్థానికులు వెంటనే అగ్నిమాపకశాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -