జర్నలిస్టుల పిల్లల ఫీజు రాయితీకి చర్యలు : డీఈఓ

నవతెలంగాణ-మేడ్చల్‌కలెక్టరేట్‌
జర్నలిస్టుల పిల్లలకు ప్రయివేటు పాఠశాలల్లో పీజు రాయితీలను కల్పించేందుకు తగిన చర్యలు తీసుకుంటా మని మేడ్చల్‌ జిల్లా విద్యాశాఖ అధికారిణి విజయకుమారి హామీనిచ్చారు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్‌ జర్నలిస్టుల సంఘం మేడ్చల్‌ జిల్లా కమిటీ ప్రతినిధులు గురువారం జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో డీిఈఓను కలిసి జిల్లాలో పని చేస్తున్న జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్యను అందించేందుకు తగిన ఉత్తర్వులు ఇవ్వాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గడ్డమీది బాలరాజు మాట్లాడుతూ గతేడాది ఇచ్చిన విధంగా ప్రత్యేక ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా ప్రొసిడిం గ్‌ను ఇవ్వడంతో పాటు ఆయా మండలాల విద్యాధికా రులకు తగిన సూచనలు చేసి ఉచిత విద్య అమలు జరిగేలా చూడాలని కోరారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా సమాజానికి సేవ చేస్తున్న జర్నలిస్టుల పిల్లలకు విద్యను అందించే బాధ్యత తీసుకోవాలని కోరారు. ఇందుకు స్పందించిన విద్యాశాఖ అధికారి విజయకుమారి మాట్లాడుతూ జిల్లాలో పని చేస్తున్న జర్నలిస్టుల పిల్లలకు ప్రయివేటు పాఠశాలల్లో ఉచిత విద్యను అందించేందుకు తన సహాయ సహకారాలు ఎప్పడూ ఉంటాయన్నారు. తగిన ఉత్తర్వులు ఇవ్వడంతో పాటు జర్నలిస్టులు తమ గుర్తింపు కార్డులతో దరఖాస్తులను డీఈఓ కార్యాల యంలో కానీ, మండలంలో ఎంఈఓ కార్యాలయాల్లో కానీ అందించి సంబంధిత పాఠశాలలకు నేరుగా లేఖలను అందించేలా కూడా చూస్తామని హామీనిచ్చారు. ఇందుకు తగిన విధంగా మండలాల ఎంఈఓలకు సూచనలను అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీయూడ బ్ల్యూజే రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు మల్కయ్య, జిల్లా కార్యదర్శి వెంకట్రామిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు రామకృష్ణ, బాల్‌రెడ్డి, కోశాధికారి భిక్షపతి, సహాయ కార్యదర్శి వెంకట్‌రెడ్డి, కుత్బుల్లాపూర్‌ ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు కొటగడ్డ శ్రీనివాస్‌, కోశాధికారి శేషారెడ్డి, ఉప్పల్‌ నియోజకవర్గ కార్యదర్శి శ్రీనివాస్‌, శామీర్‌పేట ప్రెస్‌ క్లబ్‌ రవికుమార్‌, పలువురు జర్నలిస్టులు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love