కేసీఆర్‌కు పదేళ్ల తర్వాత రైతులు గుర్తువచ్చారా: సీఎం రేవంత్‌రెడ్డి

నవతెలంగాణ – హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నిలకు తుక్కుగూడ వేదిక నుంచే కాంగ్రెస్‌ పార్టీ జాతీయస్థాయి మేనిఫెస్టో విడుదల చేస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక తెలంగాణకు ఇవ్వనున్న ప్రత్యేక నిధులు, అనుమతులను అందులో పొందుపరుస్తామని చెప్పారు. ఏప్రిల్‌ 6న నిర్వహించనున్న ‘జనజాతర’ సభ ఏర్పాట్లను మంత్రులు, పార్టీ నేతలతో కలిసి పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పదేళ్ల కేసీఆర్‌ పాలనలో వందేళ్ల విధ్వంసం జరిగిందని రేవంత్‌రెడ్డి అన్నారు. కోలుకోలేని విధంగా బీఆర్ఎస్ నేతలు ఆర్థిక, సహజ వనరులను దోచుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ పాలనతో రాష్ట్రంలో కరవు వచ్చిందంటూ ఇటీవల కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. 80 వేల పుస్తకాలు చదివిన ఆయనకు వర్షాకాలం, చలికాలం ఎప్పుడొస్తుందో కూడా తెలియదా?అని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌కు పదేళ్ల తర్వాతైనా రైతులు, వ్యవసాయం గుర్తొచ్చినందుకు, ఇప్పటికైనా పొలం బాట పట్టినందుకు సంతోషమని వ్యాఖ్యానించారు.

Spread the love