వ్యర్థాలను తగబెడుతూ రైతులు చనిపోవడం బాధాకరం
పంట వ్యర్థాలను కాల్చితే రూ.5 వేల నుంచి 25 వేల వరకు జరిమానా
వ్యవసాయ శాఖ సంచాలకులు డాక్టర్ బి.గోపి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పంటల అవశేషాలను తగలబెట్టడం ద్వారా భూసారం దెబ్బతింటుందనీ, పర్యావరణానికి తీవ్ర ముప్పు ఏర్పడుతుందని తెలంగాణ వ్యవసాయ శాఖ సంచాలకులు డాక్టర్ బి.గోపి తెలిపారు. సోమవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. వ్యవసాయ శాఖ అధికారులు గ్రామస్థాయిలో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నప్పటికీ పంట వ్యర్థాలను రైతులు కాల్చివేయడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల భూపాలపల్లి జిల్లాకు చెందిన రైతులు చాగర్ల చంద్రమౌళి, భాగ్యమ్మలు పంట వ్యర్థాలు కాల్చే క్రమంలో ప్రమాదవశాత్తు మృతి చెందటం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా వ్యర్థాల బహిరంగ దహనాన్ని పూర్తిగా నిషేధిస్తూ పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ జీవో 27 ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. వ్యవసాయ భూముల్లో, మైదానాల్లో (ల్యాండ్ఫిల్ సైట్లలో), ఇతర ప్రదేశాలలో వ్యర్థాలను బహిరంగంగా కాల్చడం పూర్తిగా నిషేధించిన విషయాన్ని గుర్తుచేశారు. సాధారణంగా చెత్తను కాల్చితే రూ.5,000 వేలు, భారీ స్థాయిలో వ్యర్థాలను కాల్చితే రూ.25 వేలు పర్యావరణ పరిహారం విధిస్తారనే విషయాన్ని క్షేత్రస్థాయి అధికారులు రైతులకు విడమర్చి చెప్పాలని సూచించారు.
పంటల అవశేషాలను కాల్చకండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



