నవతెలంగాణ – హైదరాబాద్ : దేశంలో సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం ప్రెస్ నోట్ విడుదల చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి ఇప్పటివరకు దేశంలో 245 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్టు ఈడీ తన ప్రెస్ నోట్ లో తెలిపింది. ఢిల్లీ, హైదరాబాద్, ముంబయి, చెన్నైలో సోదాలు చేపట్టామని, ఈ కేసులో మనీశ్ సిసోడియా, సంజయ్ సింగ్, విజయ్ నాయర్, కవిత సహా ఇప్పటివరకు 15 మందిని అరెస్ట్ చేశామని వివరించింది. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో రూ.128.79 కోట్ల నగదు సీజ్ చేశామని తెలిపింది. హైదరాబాదులోని కవిత నివాసంలో ఈ నెల 15న సోదాలు జరిపామని, సోదాల సమయంలో కవిత బంధువులు ఆటంకం కలిగించారని ఈడీ వివరించింది. ఆప్ నేతలతో కలిసి కవిత అక్రమాలకు పాల్పడినట్టు దర్యాప్తులో తేలిందని స్పష్టం చేసింది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నామని వెల్లడించింది.