ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తాం: సందీప్ శాండిల్య

నవతెలంగాణ – హైదరాబాద్: త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు నగరంలో ప్రశాంతంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ నూతన పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య అన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో నిన్న ఆయన బంజారాహిల్స్‌లోని తెలంగాణ రాష్ట్ర పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో బాధ్యతలు చేపట్టారు. నిజానికి ఆయన నేడు బాధ్యతలు స్వీకరిస్తారని వార్తలు వచ్చినప్పటికీ ఈసీ గ్రీన్ సిగ్నల్ అనంతరం సీఎస్ ఉత్తర్వులు విడుదల చేసిన గంటలోనే శాండిల్య పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం.. ఆయా రాష్ట్రాల్లోని పలువురు అధికారులను బదిలీ చేసింది. ఈ క్రమంలో తెలంగాణలోనూ పలువురు ఐఏఎస్, ఐపీఎస్, ఇతర అధికారులను బదిలీ చేసింది. వారి స్థానాల భర్తీ కోసం అధికారుల జాబితా పంపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సీఎస్ శాంతికుమారి అధికారుల జాబితా పంపగా వారిని ఆయా స్థానాల్లో నియమిస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

Spread the love