– 9999 అనే కాదు సాధారణ నెంబర్లకూ డిమాండ్
– ఆన్లైన్ విధానంలో నేరుగా పోటీలోకి..
– రాజకీయ పైరవీలు, పై అధికారుల ఒత్తిళ్లకు అడ్డుకట్ట!
– మూడేండ్లలో గ్రేటర్ పరిధిలో భారీగా పెరిగిన ఆర్టీఏ ఆదాయం
-మాధవరెడ్డి సారంపల్లి
రవాణాశాఖ తీసుకొచ్చిన ఫ్యాన్సీ నెంబర్ల ఆన్లైన్ విధానానికి భారీ స్పందన లభిస్తోంది. ఫ్యాన్సీ నెంబర్ల ఆన్లైన్ ఈ-వేలం సులభతరంగా ఉండటంతో ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది. దళారులు, రాజకీయ నేతల పైరవీలు, ఉన్నతాధికారులు, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పోయింది. ఆన్లైన్ విధానం ప్రవేశపెట్టక ముందు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలు, డబ్బున్న వారే ఎక్కువగా ప్రత్యేక నెంబర్ల కోసం పోటీ పడేవారు. అయితే ఆన్లైన్ విధానంలో ఫ్యాన్సీ నెంబర్ల విక్రయం ప్రవేశపెట్టాక.. నచ్చిన నంబర్ కోసం ప్రతి ఒక్కరూ పోటీ పడుతున్నారు. ఫలితంగా రవాణాశాఖ ఖజానాకు ఏటా కోట్లాది రూపాయల ఆదాయం చేరుతుండటం విశేషం.
మాన్యువల్ పద్ధతిలో ఏజెంట్లు, మధ్యవర్తుల ప్రమేయం పెరిగిందన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఆర్టీఏ ఉన్నతాధికారులు ఆన్లైన్ బిడ్డింగ్ విధానానికి శ్రీకారం చుట్టిన విషయం విదితమే. 2020 ఫిబ్రవరి 10న ప్రయోగాత్మకంగా హైదరాబాద్లోని ఐదు ఆర్టీఏ కార్యాలయాల పరిధిలో ఫ్యాన్సీ నెంబర్ల ఆన్లైన్ బిడ్డింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇది మంచి ఫలితాన్ని ఇవ్వడంతో 2021 ఫిబ్రవరిలో రాష్ట్రమంతటా విస్తరించారు. ముఖ్యంగా ఆన్లైన్ విధానంలో వాహనదారులు తమకు నచ్చిన 0099, 0009, 999, 9999, 6666, 6999, 1, వంటి అనేక నెంబర్లను ఇండ్లు, ఆఫీసు ఎక్కడి నుంచైనా పొందే వెసులుబాటు లభించింది.
గ్రేటర్ పరిధిలో హైదరాబాద్ జేటీసీ పరిధిలోని ఖైరతాబాద్ ఆఫీసు, ఆ తర్వాత అత్తాపూర్, ఇబ్రహీంపట్నం, మేడ్చల్, ఉప్పల్, తిరుమలగిరి కార్యాలయాల పరిధిలో ఫ్యాన్సీ నెంబర్లకు పోటీ ఎక్కువగా ఉంది.
రెండింతలు పెరిగిన ఆదాయం..!
ఫ్యాన్సీ నెంబర్ల ఆన్లైన్ విధానం ప్రారంభమయ్యాక ప్రభుత్వ ఆదాయం పెరుగుతూ వస్తోంది. అప్పటివరకు పోటీ ఉన్న నెంబర్లకే కాకుండా సాధారణ నెంబర్లకు పోటీ పెరిగింది. దీంతో గడిచిన మూడేండ్లలో ఒక్క హైదరాబాద్ పరిధిలోనే రూ.62.28కోట్ల రాబడి వచ్చింది. ఇందులో ఈ ఏడాది జనవరి నుంచి ఈనెల 13వరకు రూ. 13.54కోట్ల ఆదాయం రావడం విశేషం. రాష్ట్రవ్యాప్తంగా రూ.100 కోట్లకుపైగా ఆదాయం వచ్చింది. ఫ్యాన్సీ నెంబర్ల ఆదాయం రెండింతలు పెరిగిందని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు.
సాధారణ నెంబర్లకు లక్షల్లో చెల్లింపు..!
క్రేజీ కోసం కొందరు.. న్యూమరాలజీ కోసం మరికొందరు ఫ్యాన్సీ నెంబర్లు తీసుకుంటున్నారు. నచ్చిన నెంబర్ కోసం ఎంత ఖర్చు పెట్టేందుకైనా వాహనదారులు వెనుకాడటం లేదు. జూన్లో జరిగిన ఈ వేలంలో 9999 నెంబర్ను ఆస్పెర్ హౌమ్స్ అండ్ ఇన్ఫ్రాటెక్ సంస్థ రూ.9లక్షలు వెచ్చించి సొంతం చేసుకుంది. అత్తాపూర్ ఆర్టీఏ పరిధిలో 3456 నెంబర్ కోసం ఓ వ్యక్తి 3.50లక్షలు చెల్లించగా.. గతంలో ఈ నెంబర్కు రూ.50వేల నుంచి లక్షలోపు ధర పలికింది. ఉప్పల్ ఆర్టీఏ పరిధిలో నాలుగైదు రోజుల కిందట ఓ వ్యక్తి 2979 నెంబర్ కోసం రూ.35 వేలకుపైనే చెల్లించి సొంతం చేసుకున్నారు. ఆన్లైన్కు ముందు ఈ నెంబర్ రూ.5వేల నుంచి పది వేలలోపే దక్కడం గమనార్హం.
పైరవీల్లే కుండా ఫ్యాన్సీ నెంబర్ల కేటాయింపు
రవాణాశాఖలో పౌరసేవలన్నీ పూర్తిపారదర్శకతతో పాటు ప్రజలకు ఇబ్బందులు లేకుండా అందించడమే లక్ష్యంగా గట్టి చర్యలు తీసుకుంటున్నాం. పైరవీలు లేకుండా పూర్తిగా ఆన్లైన్ విధానంలో ఫ్యాన్సీ నెంబర్ల కేటాయింపు చేయడం ద్వారా ప్రభుత్వ ప్రతిష్ట పెరిగింది. వినియోగదారుల్లో రవాణాశాఖ పట్ల మంచి నమ్మకం ఏర్పడింది. ఫలితంగా ఏటేటా ప్రత్యేక నెంబర్ల ద్వారా కోట్లాది రూపాయల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు చేరడమే ఇందుకు నిదర్శనం.
జె.పాండురంగ నాయక్, జేటీసీ, హైదరాబాద్
నగర పరిధిలో జనవరి- డిసెంబర్ వరకు ఆదాయం ఇలా..
సంవత్సరం రిజర్వేషన ఫీజుబిడ్ అమౌంట్ మొత్తం
20203 76,47,300 6,04,07,900.50 9,80,55,200.50
2021 8,26,41,500 8,11,26,482 16,37,67,382
2022 9,94,65,125 12,61,00217.25 22,55,65,342.25
2023 5,77,81,213 7,77,10,535 13,54,91,748
(2023 జనవరి నుంచి జులై 13 వరకు)