– మ్యానిఫెస్టో ఓ చిత్తు కాగితం
– ఓటమిని అంగీకరించారు…
– కాంగ్రెస్ గ్యారెంటీలను కాపీ కొట్టిన బీఆర్ఎస్
– బీఆర్ఎస్కు ఆలోచన, ఆచరణ లేదు
– సంక్షేమం అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదుొ కేసీఆర్కు సూటిగా సవాల్ విసురుతున్నా…
– చుక్క మందు పోయకుండా, డబ్బులు పంచకుండా ఓట్లు అడగాలి
– రేపు అమరవీరుల స్థూపం వద్ద ప్రమాణం చేద్దాం…రా : సీఎం కేసీఆర్కు రేవంత్ సవాల్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం విలేకర్లతో మాట్లాడిన మాటలు రాబోయే ఎన్నికల్లో ఓటమిని అంగీకరించినట్టు ఉన్నాయని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్రెడ్డి చెప్పారు. కాడి కిందపడేసిననట్టు కనిపించారని ఎద్దేవా చేశారు. ‘మీ పాలనకు డేట్ ఎక్స్పైరీ అయింది. ఇక మీరు విశ్రాంతి తీసుకోండి’ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను చూసి కేసీఆర్కు చలి జ్వరం వచ్చిందన్నారు. వందకు వంద శాతం కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనీ, ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తుందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలను కేసీఆర్ కాపీ కొట్టి బీఆర్ఎస్ మ్యానిఫెస్టో ప్రకటించారని ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్లోని తన నివాసంలో పార్టీ నేతలతో కలిసి రేవంత్ విలేకర్లతో మాట్లాడారు. మేము ఆరు గ్యారంటీలు ఇస్తామంటే బీఆర్ఎస్ నేతలు అదెలా సాధ్యమన్నారు. కానీ ఇప్పుడు మా గ్యారంటీలనే సీఎం కేసీఆర్ కాపీ కొట్టారని విమర్శించారు. కేసీఆర్ ఆలోచన శక్తి కోల్పోయారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్కు ఆలోచన, ఆచరణ, సంక్షేమం అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు. నిజంగా రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీయకపోతే…ఉద్యోగులకు, ఆసరా పెన్షనర్లకు ప్రతినెల మొదటి తారీఖు వారి ఖాతాల్లో డబ్బు జమ చేయాలని సవాల్ విసిరారు. అప్పుడే మీరు ప్రకటించిన మ్యానిఫెస్టోలోని హామీలను నమ్ముతామన్నారు.
బీఆర్ఎస్ మ్యానిఫెస్టోపై చర్చ అనవసరం
సీఎం కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ మ్యానిఫెస్టో ఓ చిత్తు కాగితమనీ, దానిపై చర్చ అనవసరమన్నారు. ‘మహాలక్ష్మి పథకం కింద కాంగ్రెస్ రూ.2,500 అంటే కేసీఆర్ రూ.3 వేలు అన్నారు. ఆడబిడ్డలకు మేం రూ.500లకు గ్యాస్ సిలిండర్ అంటే ఆయన రూ.400 అన్నారు. పెన్షన్ల విషయంలో మేం రూ.4 వేలు అంటే ఆయన రూ.5 వేలు అన్నాడు.మేం ఇందిరమ్మ భరోసా కింద రైతులకు, కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు రూ.15 వేలు ఇస్తామంటే…ఆయన ఇప్పుడు రూ.16 వేలు ఇస్తామంటున్నాడు. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అంటూ గతంలో సారా పాటలు నిర్వహించేవారు. సీఎం తీరు కూడా అలాగే ఉందని’ అని చెప్పారు. బ్లాక్ అండ్ వైట్ సినిమాను కలర్లో చూపించినట్లు బీఆర్ఎస్ ఎన్నికల ప్రణాళిక ఉందన్నారు. గత రెండేండ్లుగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ కాగితంపై రాసుకుని ఆదివారం ప్రకటించారని ఎద్దేవా చేశారు. మేము రూ.4వేల పెన్షన్, రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామంటే… అదెలా సాధ్యమవుతుంది? అంటూ ఇన్నాళ్లు మాట్లాడిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు? అని ప్రశ్నించారు. కేసీఆర్లా మేము ఉత్తుత్తి హామీలు ఇవ్వలేదన్నారు. ఆరు గ్యారంటీలను అమలు చేయగలమనే నమ్మకంతోనే వాటిని ప్రకటించామని తెలిపారు.
అభ్యర్థులకు అభినందనలు
కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు పొందిన అభ్యర్థులకు రేవంత్ అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించగానే…బీఆర్ఎస్ అభ్యర్థులకు కేసీఆర్ బీఫారాలు పంచారని ఎద్దేవా చేశారు. అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కంటే ముందు ఉందన్నారు. మేము 55 మంది అభ్యర్థులను ప్రకటిస్తే, కేసీఆర్ 51 మందికే బీఫారాలు ఇచ్చారనీ, మిగతా వారికి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ‘కేసీఆర్కు సూటిగా సవాల్ విసురుతున్నా..ఈ ఎన్నికల్లో చుక్క మందు పోయకుండా, డబ్బులు పంచకుండా ఓట్లు అడగాలి. మంగళవారం 12 గంటలకు అమరవీరుల స్థూపం వద్దకు నేను వస్తా…కేసీఆర్ నువ్వు అక్కడికి రా… ప్రమాణం చేద్దాం’ అని సవాల్ విసిరారు.