– ఉప్లూర్ లో ఉపాధ్యాయుల బడిబాట
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
ప్రభుత్వ పాఠశాలల్లో అందించే సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఉప్లూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజన్న, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు గిరిధర్ అన్నారు. మంగళవారం మండలంలోని ఉప్లూర్ లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు గ్రామంలో ప్రొఫెసర్ జయ శంకర్ బడి బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యతను విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు లభించే సౌకర్యాలతో ముద్రించిన కరపత్రాలను అందజేశారు.
సందర్భంగా ప్రధానోపాధ్యాయులు రాజన్న, గిరిధర్ మాట్లాడుతూ బడి ఈడు పిల్లలను, బడి బయట పిల్లలను, బడి మధ్యలో మానేసిన పిల్లలను బడిలో చేర్పించడం, అసలు పాఠశాలకు వెళ్ళని పిల్లలు లేకుండా చూడడం బడిబాట కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్నారు.ప్రభుత్వం ఈనాడు విద్యార్థుల కోసం పాఠశాలల్లో ఎన్నో సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, మధ్యాహ్న భోజనం అందిస్తుందని తెలిపారు. ప్రభుత్వం అందించే సౌకర్యాలను సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థులు మంచిగా చదివి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చు అన్నారు.అనంతరం గ్రామంలో బడి ఈడు పిల్లల ఇంటికి వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడారు. కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు సిరిమల్ల దేవన్న, సల్లూరి కిషన్ గౌడ్, గుండోజి రవీందర్, చంద్రకళ, శ్రావణి, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు మాసం శ్రీనివాస్ గౌడ్, సుమలత, శిరీష, తదితరులు పాల్గొన్నారు.



