తిరువనంతపురం : కేరళ అసెంబ్లీ ఆమోదించిన ఐదు బిల్లులపై గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ఖాన్ ఎట్టకేలకు సంతకం చేశారు. ఏళ్ల తరబడి బిల్లులను ఆమోదించకుండా, రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న గవర్నర్ తీరుపై రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడం, కేరళ గవర్నరు తీరుపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసిన తరువాత బిల్లుల్లో కదలిక వచ్చింది. సభ ఆమోదించిన బిల్లులను నిరవధికంగా పెండింగ్లో ఉంచే అధికారం గవర్నరుకు లేదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలోనే ల్యాండ్ అసైన్మెంట్ సవరణ బిల్లు, వరి పండించే ప్రాంతం, మెట్ట ప్రాంతాల పరిరక్షణ బిల్లు, సహకార సంఘాల సవరణ బిల్లు, సహకార చట్టం సవరణ బిల్లు, అబ్కారీ చట్ట సవరణ బిల్లులపై సంతకం చేశారు. గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ శనివారం మీడియాతో మాట్లాడుతూ తాను కొన్ని రోజుల క్రితం ఐదు బిల్లులపై సంతకాలు చేశానని చెప్పారు. బిల్లులను పరిశీలించి ఆమోదించాలని నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. ఈ నిర్ణయంతో సుప్రీంకోర్టు ఆదేశాలకు సంబంధం లేదన్నారు.