సీబీఐ కస్టడీకి కవిత

Kavitha to CBI custody– 15న హాజరుపర్చాలి
– రౌస్‌ అవెన్యూ కోర్టు ఆదేశం
– కేసే తప్పయితే … చెప్పేదేముంది : కవిత
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో అరెస్టైన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మూడ్రోజుల పాటు సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌(సీబీఐ) కస్టడీకి అనుమతిస్తూ రౌస్‌ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు వెలువరించింది. ఈనెల 14 వరకు సీబీఐ కస్టడీకి అప్పగించిన కోర్టు, 15న ఉదయం 10 గంటలకు తిరిగి కవితను కోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది. కవిత విచారణకు సహకరించనందున ఆమె నుంచి కీలక సమాధానాలు రాబట్టేందుకు ఐదు రోజులు సీబీఐ కస్టడీకి ఇవ్వాలని కోరగా… కేవలం మూడు రోజుల కస్టడీకి అనుమతిస్తున్నట్లు స్పష్టం చేసింది. అలాగే సీబీఐ కస్టడీలో ప్రతి రోజు సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటల వరకు కుటుంబ సభ్యులను కలిసేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. కవిత భర్త అనిల్‌, పిల్లలు, తల్లి శోభారావు, సోదరులు కేటీఆర్‌, సంతోష్‌ రావు, పీఏ శరత్‌ కలిసేందుకు అనుమతిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. అనంతరం కవితను ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయానికి తరలించారు. లిక్కర్‌ స్కాం మనీలాండరింగ్‌ కేసులో అరెస్టై జ్యుడీషియల్‌ కస్టడీలో భాగంగా తీహార్‌ జైళ్లో ఉన్న కవితను గురువారం మధ్యాహ్నం 12:15 నిమిషాలకు సీబీఐ అధికారులు అరెస్ట్‌ చేశారు. శుక్రవారం ఉదయం 10:30 నిమిషాలకు కవితను రౌస్‌ అవెన్యూ సీబీఐ స్పెషల్‌ కోర్టులో హాజరుపరిచారు. కవితకు వ్యతిరేకంగా సహ నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలు, వాట్సాప్‌ చాట్‌లు, ఇతర ఆధారాలను కోర్టుకు సమర్పించారు. ఆధారాలపై సుమారు గంటన్నరకు పైగా వాదనలు సాగాయి. ఈ సందర్భంగా సీబీఐ తరపు సీనియర్‌ న్యాయవాది పంకజ్‌ కుమార్‌ వాదనలు వినిపిస్తూ… లిక్కర్‌ స్కాంలో కవిత కింగ్‌ పిన్‌గా వ్యహరించారని ఆరోపించారు. సూత్రధారితో పాటు పాత్రధారిగా ఉన్నారని ఆరోపించారు. ఆప్‌ నేతలకు రూ.100 కోట్లను సమకూర్చడంతో పాటూ… తమకు అనువుగా లిక్కర్‌ స్కాంను రూపొందించుకోవడంలో కవిత కీలక పాత్ర పోషించారన్నారు. ఈ కేసు దర్యాప్తులో ఇప్పటికే సహ నిందితుల వాంగ్మూలాలు నమోదు చేసినట్లు వివరించారు. అప్రూవర్లుగా మారిన వారితో పాటు కవిత సన్నిహితులు అభిషేక్‌ బోయినపల్లి, మాజీ ఆడిటర్‌ బుచ్చిబాబు, ఇతరులు కవిత పాత్రపై కీలక సమాచారం ఇచ్చారన్నారు. అయితే తాజా సమాచారంపై కవితను ప్రశ్నించగా… ఆమె తప్పించుకునే సమాధానాలు ఇస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. విచారణకు సహకరించడం లేదని, అందుకే ట్రయల్‌ కోర్టు అనుమతితో కవితను తీహార్‌ జైల్‌ కస్టడీలోనే అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. అయితే తీహార్‌ జైల్లో కవితను ఈ నెల 6న సీబీఐ విచారించడం, సీబీఐ కవితను అరెస్ట్‌ చేయడంపై ఆమె తరపు న్యాయవాదులు విక్రమ్‌ చౌదరి వర్చువల్‌ మోడ్‌లో నితీష్‌ రాణా, మోహిత్‌ రావు కోర్టు హాల్‌ లో అభ్యంతరం తెలిపారు. సీబీఐ రిమాండ్‌ పై విచారణకు ముందు… కవిత విచారణ, అరెస్ట్‌పై తాము దాఖలు చేసిన రెండు పిటిషన్లపై విచారణ చేపట్టాలని కోర్టును కోరారు. ఇందుకు అనుమతించిన స్పెషల్‌ జడ్జ్‌ కావేరి బవేజా మధ్యాహ్నం 2 గంటలకు విచారణను వాయిదా వేశారు. అనంతరం 2 గంటలకు విచారణ ప్రారంభం కాగా ప్రతివాది అయిన కవిత, ఆమె తరపు న్యాయవాదులైన తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సీబీఐ అక్రమంగా వ్యవహరించిందని విక్రమ్‌ చౌదరి వాదనలు వినిపించారు. మరోవైపు సీబీఐ రిమాండ్‌పై కూడా విచారణ ముగించిన స్పెషల్‌ జడ్జ్‌ తీర్పు రిజర్వ్‌ చేశారు. సాయంత్రం 4:10 నిమిషాలకు కవితను సీబీఐ కస్టడీకి అప్పగిస్తున్నట్లు ఉత్తర్వులు విడుదల చేశారు.
కేసే తప్పయితే … చెప్పేదేముంది : కవిత
లిక్కర్‌ కేసే తప్పయితే.. ఇంకా సీబీఐ గురించి చెప్పేది ఏముందని కవిత అన్నారు. కోర్టు హాల్‌ నుంచి బయటకు వస్తున్న సమయంలో మీడియా వేసిన ప్రశ్నలకు స్పందించారు. సీబీఐ మళ్లీ అవే ప్రశ్నలు అడుగుతుంది. కొత్తగా చెప్పేది ఏమీ లేదు. సీబీఐది వృధా ప్రయాస. సీబీఐ చేస్తోంది తప్పు.. అని అన్నారు.

Spread the love