Monday, June 8, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసంగారెడ్డిలో ఫిక్సింగ్ రాజకీయాలు

సంగారెడ్డిలో ఫిక్సింగ్ రాజకీయాలు

- Advertisement -

మంత్రి దామోదర్, హరీశ్ రావు, జగ్గారెడ్డి, రఘునందన్ రావు మిలాఖత్
జహీరాబాద్ బుల్లెట్ ట్రైన్‌పై రఘు నందన్‌రావు మౌనం వీడాలి : టీఆర్‌ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట కవిత

నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
సంగారెడ్డిలో ఫిక్సింగ్ రాజకీయాలకు పాల్పడుతున్నారని టీఆ‌ర్‌ఎస్ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట కవిత ఆరోపించారు. ఆదివారం సంగారెడ్డిలో నిర్వహించిన జెండా పండుగకు ఆ పార్టీ నాయకులు కులబ్‌‌గూర్‌ దయాకర్ రెడ్డి, సంఘమిత్ర, శ్రీనివాస్ రెడ్డితో కలిసి కవిత టీఆ‌ర్‌ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. సంగారెడ్డిది ఘనమైన ఉద్యమ చరిత్ర అని, 1930లో జోగిపేట నుం‌చే భారతదేశ స్వాతంత్య్ర పోరాటం ప్రారంభమైందని అన్నారు. అలాంటి చోట జగ్గారెడ్డి, హరీశ్ రావు, దామోదర్, చింతా ప్రభాకర్, రఘునందన్ రావు ఫిక్సింగ్ రాజకీయాలకి పాల్పడుతున్నారని ఆరోపించారు. చూడడానికి వేరువేరు పార్టీల్లో ఉన్నా అందరూ ఒకటే అని 30 ఏండ్లుగా ఇక్కడ రాజ్యమేలుతున్న రాజకీయ పార్టీలు ఏం చేశాయో చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాల కోసం అని, కానీ సింగూరు ప్రాజెక్టు 15 సంవత్సరాలుగా కుంగిపోతోందని తెలిపారు. హైదరాబాద్‌కు నీరు అందించడంతోపాటు 60 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్న ఈ ప్రాజెక్టును పట్టించుకోలేదని ఆరోపించారు. తెలంగాణ మొట్టమొదటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీశ్ రావు ఇక్కడ నుండే ప్రాతినిధ్యం వహిస్తున్నారని, సింగూరును పూర్తిగా పట్టించుకోకపోవడం వల్లే ప్రస్తుతం అది కుంగిపోయి ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. జహీరాబాద్‌కు బుల్లెట్ ట్రైన్ విషయమై రఘునందన్ రావు నోరు మెదపడం లేదన్నారు. ఆందోల్‌లో ఒక మంత్రి బావమరిది 200 ఎకరాల భూమిని కబ్జా చేసినా అడిగే నాథుడే లేడని, పటాన్‌చెరు ఎమ్మెల్యే అసలు ఏ పార్టీలో ఉన్నారో కూడా ప్రజలకు తెలియడం లేదని అన్నారు. మన ప్రాంతాన్ని ప్రేమించే ప్రాంతీయ పార్టీ ద్వారానే అభివృద్ధి సాధ్యమని, టీఆర్‌ఎస్ పార్టీని ప్రజలు తమ ‘ఇంటి పార్టీ’గా ఆదరించాలని కోరారు.

‘పాంచ జన్యం’ పేరిట హామీలు
తెలంగాణలో టీఆ‌ర్‌ఎస్ అధికారంలోకి రాగానే పాంచ జన్యం పేరుతో ఉచిత విద్య, వైద్యం అందిస్తామని, వ్యవసాయానికి ప్రాధాన్యతనిస్తూ ప్రత్యేక ఆఫీసర్లను నియమిస్తామని, యువతకు 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని కవిత హామీ ఇచ్చారు. ఉపాధి కోసం రూ.2 లక్షల నుంచి రూ.20 కోట్ల వరకు బ్యాంకుతో సంబంధం లేకుండా సహాయం అందిస్తామన్నారు. సామాజిక న్యాయం పాటిస్తామని తెలిపారు. ప్రయివేట్‌ పాఠశాలల్లో ఫీజుల మోత మోగిపోతుందని తెలిపారు. ఈ హామీలపై నేనిచ్చిన మాట తప్పితే తెల్లాపూర్ శిలాశాసనం వద్ద కట్టేసి రాళ్లతో కొట్టండి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఇన్‌చార్జి బాలయ్య, నాయకులు కరుణాకర్, నితిన్, శ్రీకాంత్, కేడీఆర్ యువసేన అధ్యక్షులు గోపాల్ రెడ్డి, పార్టీ శ్రేణులు, మహిళలు, యువతీ యువకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -