హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో వరదల బీభత్సం…

నవతెలంగాణ – హైదరాబాద్
హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటి వరకు 54 మంది ప్రాణాలు కోల్పోయారు. మరెంతోమంది నిలువనీడ కోల్పోయారు. కొండచరియలు విరిగిపడడంతో జాతీయ రహదారులపై రవాణా స్తంభించింది. పలు ప్రాంతాల్లో ఇళ్లు ధ్వంసమయ్యాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మృతి చెందిన 54 మందిలో 51 మంది ఒక్క హిమాచల్‌ప్రదేశ్‌లోనే మృతి చెందడం గమనార్హం. సిమ్లాలోని సమ్మర్ హిల్ ప్రాంతంలో శివాలయంలపై రెండు కొండచరియలు విరిగిపడడంతో 14 మంది భక్తులు చనిపోయారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుపోయి ఉంటారని భావిస్తున్నారు. సోలాన్‌లో ఒకే కుటుంబంలోని ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలోని 9 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో రూ. 7,171 కోట్ల నష్టం వాటిల్లినట్టు ప్రభుత్వం అంచనా వేసింది. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా స్వాతంత్ర్య వేడుకలకు అంతరాయం ఏర్పడింది. ఉత్తరాఖండ్‌లోనూ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. ముగ్గురు మరణించగా మరో 10 మంది గల్లంతయ్యారు. కొండచరియలు విరిగిపడడంతో భవనాలు ధ్వంసమయ్యాయి. బద్రీనాథ్, కేదార్‌నాథ్, గంగోత్రి వెళ్లే రహదారులపై రవాణాకు ఆటంకం ఏర్పడింది. దీంతో చార్‌ధామ్ యాత్రను రెండు రోజులపాటు నిలిపివేశారు.

Spread the love