నవతెలంగాణ-హైదరాబాద్ : జమ్మూకశ్మీర్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. శనివారం రాత్రి కురిసిన వర్షానికి రాజౌరీ, పూంచ్ జిల్లాల్లో మెరుపు వరదలు సంభవించాయి. వరద ధాటికి ఇప్పటివరకు 10 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. పలువురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. రాజౌరీలో నదులు పొంగిపొర్లడంతో పలు ప్రాంతాలను వరద ముంచెత్తింది. కొత్త బస్టాండ్ పూర్తిగా నీటమునిగింది. అనేక వాహనాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. దార్హాలి, ఖాండ్లీ, సుక్తోహ్, జమోలా నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నా బేలా కాలనీ సమీపంలో దార్హాలి నది రక్షణ గోడ ధ్వంసమైంది. అబ్దుల్లా బ్రిడ్జి సమీపంలోని 50కి పైగా కుటుంబాలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
పూంచ్ జిల్లాలో పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. సహాయక బృందాలు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. వరదల వల్ల ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు భారీ నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. పరిస్థితిని ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తెలిపారు. జులై 23 వరకు జమ్మూకశ్మీర్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.



