బిజీ లైఫ్ స్టైల్లో ఆహారం, ఆరోగ్యంపై సరైన శ్రద్ధ వహించడంలేదు. ఇటీవల కాలంలో చాలా మంది డయాబెటీస్, స్థూలకాయం, బీపీ, అల్సర్స్, మలబద్ధకం, అజీర్తి వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. మన ఆరోగ్యం మెరుగ్గా ఉండాలంటే మన జీర్ణవ్యవస్థ పనితీరు సవ్యంగా సాగాలి. ఆ క్రమంలో మెరుగైన జీర్ణవ్యవస్థ కోసం తీసుకునే ఆహారంలో ఫైబర్ ఉండడం చాలా ముఖ్యం. పీచు పదార్థం ఉండే ఆహారం జీర్ణ సంబంధిత సమస్యలను నివారిస్తుంది. అంతేకాక అజీర్తీ, మలబద్ధకం వంటి కడుపు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాదు.. పీచు పదార్థాలు బరువు తగ్గడానికి, ఇంకా గుండెను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో కూడా ఇవి సహకరిస్తాయి. ఫలితంగా మీ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మరి అధిక ఫైబర్ కోసం ఏయే ఆహారాలను తీసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
పీచు అధికంగా వుండే ఆహార పదార్ధాలు:
పచ్చని ఆకు కూరలు: పుంటికూర, బచ్చలి, మెంతి, కరివేపాకు మొదలైన పచ్చని ఆకు కూరల్లో పీచు అధికంగా వుంటుంది. కనుక తినే ఆహారంలో ఆకు కూరలు ప్రధానంగా వుండాలి.
ధాన్యాలు: సాధారణంగా మనం తీసుకునే ధాన్యాల్లో కావలసినంత పీచు వుంటుంది. బియ్యం, గోధుమ, జొన్న, పప్పులు, ఓట్సులో పీచు అధికంగా ఉంటుంది. ఇవి మన శరీరానికి కావలసిన మెగ్నీషియం, బి 6 విటమిన్ కూడా అందిస్తాయి. ఇవి కనుక ముతక ధాన్యాలైతే (పాలిష్ కానివి) పీచు మరింత అధికంగా కూడా వుంటుంది. తెల్లని బ్రెడ్ కంటే బ్రౌన్ బ్రెడ్ లేదా తెల్లని బియ్యం కంటే బ్రౌన్ రైస్ వంటివి మంచివి.
బెర్రీ పండ్లు: సాధారణంగా అందరూ వీటిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు మాత్రమే ఉన్నాయనుకుంటారు. కానీ వీటిలో పీచు కూడా అత్యధికంగా వుంటుంది.
వోట్స్: ఫైబర్ ఫుడ్లలో వోట్స్ కీలకమని చెప్పాలి. ఓట్స్ని వివిధ రకాలుగా వండుకుని తినవచ్చు. ఉప్మా నుంచి ఓట్స్ గ్రానోలా బార్ల వరకు వివిధ రకాలుగా చేసుకోవచ్చు. ముఖ్యంగా ఓట్స్తో చేసిన ఆహారాన్ని ఉదయం సమయంలో తినడం ఉత్తమం.
అవిసె గింజలు: అవిసెల్లో ఫైబర్, ప్రొటీన్స్ పుష్కలంగా ఉంటాయి. రెగ్యూలర్ డైట్లో అవిసె గింజలను చేరిస్తే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. వీటిని రైతాలో కూడా కలిపి తీసుకోవచ్చు.
బ్రోకలీ: బ్రోకలీలో విటమిన్ సి, ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. వీటిని వండుకుని తినాలి. పరోటా, చపాతీ, ఇతర ఫుడ్తో కలిపి తినొచ్చు. దీనిని తినడం ద్వారా శరీరానికి అవసరమైన ఫైబర్ అందుతోంది.