పిల్లల మెదడు చురుగ్గా పని చేయాలంటే…

If the child's brain is to work actively...జ్ఞాపకశక్తి , శ్రద్ధ, ఏకాగ్రత, పరిష్కార నైపుణ్యాలు… ఇవన్నీ ఇచ్చేది మెదడే. మెదడు ఆరోగ్యంగా ఉంటేనే పిల్లలు చక్కగా చదవగలుగుతారు. ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో మెదడు చురుగ్గా పని చేస్తేనే వారు అన్నింటా ముందుంటారు. ఇందుకోసం పిల్లల మెదడు ఆరోగ్యం సరిగా ఉండేలా చూసుకోవాలి. దానితో పాటు మానసిక ఆరోగ్యాన్నీ వారికి అందించాలి. అపుడే ముందంజలో ఉంటారు. ఈ బాధ్యత తల్లిదండ్రుల మీదనే ఉంటుంది. మెదడు ఆరోగ్యానికి ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు చాలా అవసరం. కాబట్టి పిల్లల రోజువారీ ఆహారంలో ఇవన్నీ ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా ప్రతిరోజూ గుప్పెడు డ్రైఫ్రూట్లను తినిపించడం ద్వారా వారి జ్ఞాపకశక్తిని పెంచవచ్చు. అయితే ఏయే డ్రై ఫ్రూట్స్‌లో ఏమేమి ఉంటాయో తెలుసుకుందాం…
జీడిపప్పు
డ్రై ఫ్రూట్స్‌లలో జీడిపప్పు ఒకటి. మెదడుకు మేలు చేసే విలువైన పోషకాలు దీనిలో ఉంటాయి. ముఖ్యంగా జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే మెగ్నీషియం జీడిపప్పుల్లో అధికంగా ఉంటుంది. రోజూ నాలుగు జీడిపప్పు పలుకులు పిల్లల చేత తినిపిస్తుంటే మానసిక ఆరోగ్యం సానుకూలంగా ఉంటుంది. నెగటివ్‌ థింకింగ్‌ తగ్గుతుంది.
ఎండుద్రాక్ష
ఎండు ద్రాక్షలు సహజంగానే తియ్యగా ఉంటాయి. వీటిని తినిపించడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. వీటిలో ఐరన్‌, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో రక్త ప్రవాహం సరిగా జరిగేలా చూస్తాయి. మెదడుకు తగినంత ఆక్సిజన్‌ సరఫరా అయ్యేలా జాగ్రత్త పడతాయి. కాబట్టి మెదడు ఆరోగ్యాన్ని కాపాడతాయి.
బాదంపప్పు
బాదం పప్పులను తరచూ పిల్లలు చేత తినిపిస్తే వారికి విటమిన్‌ కె, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు అందుతాయి. రాత్రిపూట బాదంపప్పును నానబెట్టి ఉదయాన పొట్టు తీసేసి తినేలా చూడాలి. ఇది మెదడు కణాలను ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షిస్తుంది. దీని వల్ల మెదడు ఆరోగ్యం మెరుగవుతుంది.
పిస్తా
పిస్తా పప్పులు చూస్తేనే నోరూరి పోతుంటాయి. ఇవి మెదడు ఆరోగ్యాన్ని పెంచే పోషకాలను కలిగి ఉంటాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్‌ బి6, యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి. విటమిన్‌ బి6 న్యూరో ట్రాన్స్‌మీటర్ల ఉత్పత్తిలో కీలకపాత్ర పోషిస్తుంది. కాబట్టి విటమిన్‌ బి6 కోసం పిస్తాలను కచ్చితంగా తినాలి. మెదడు కణాల మధ్య కమ్యూనికేషన్‌ మెరుగు పరిచేందుకు పిస్తాలు ఉపయోగపడతాయి.
ఆక్రోట్లు
వీటిని వాల్‌నట్లు అని కూడా పిలుస్తారు. వీటిలో ఆల్ఫా లినోలినిక్‌ యాసిడ్‌ అధికంగా ఉంటుంది. ఇది మెదడు ఆరోగ్యానికి చాలా అవసరం. నాడీ మార్గాల అభివద్ధిని ఇది ప్రోత్సహిస్తుంది. కాబట్టి ప్రతిరోజూ పిల్లలకు నీటిలో నానబెట్టిన వాల్‌నట్స్‌ ఇస్తుంటే, వారి జ్ఞాపకశక్తితో పాటు ఏకాగ్రత కూడా పెరుగుతుంది.
ఎండు ఖర్జూరాలు
ఖర్జూరాలలో సహజంగానే చక్కెర అధికంగా ఉంటుంది. అలాగే ఫైబర్‌ ఉంటుంది. మెదడు పనితీరుకు అవసరమైన ఎన్నో పోషకాలు దీనిలో ఉంటాయి. ఖర్జూరాలు తినడం వల్ల శక్తి త్వరగా అందుతుంది. ఫైబర్‌ కూడా శరీరంలో స్థిరంగా విడుదలవుతూ ఉంటుంది. మెదడును అప్రమత్తంగా ఉంచడంలో ఖర్జూరాలు ముందుంటాయి. ఇవి మెదడును ఆక్సీకరణ ఒత్తిడి నుండి కాపాడతాయి.

Spread the love