ఆడబిడ్డలకు అండగా…

– మహిళల సంక్షేమమే లక్ష్యంగా సర్కారు
– ఆరోగ్యలక్ష్మితో 36,26,603 మంది మహిళలకు లబ్ది
– దశాబ్ది ఉత్సవాల్లో నేడు మహిళా సంక్షేమ దినోత్సవం
– ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
అరవై ఏళ్ల సుదీర్ఘ పోరాటంతో స్వరాష్ట్రం ఏర్పాటు కలను సాకారం చేసుకున్న తెలంగాణ తొమ్మిదేళ్ల కాలంలో జనాభాలో సగభాగంగా ఉన్న ఆడబిడ్డలకు అండగా నిలుస్తున్నది. ఈ కాలంలో దేశం యావత్తూ అబ్బురపడే పథకాలను అమలు చేస్తూ… దేశానికీ, అంతర్జాతీయంగా ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. ఎన్నో కష్టాలు, బలిదానాలు, త్యాగాలతో సాధించుకున్న రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని ప్రభుత్వం పలు పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తున్నది. మాతా శిశు సంరక్షణ కార్యక్రమాల అమల్లో భాగంగా చేపట్టిన వివిధ పథకాలకు దేశ వ్యాప్తంగా ప్రశంసలొచ్చాయి.
గర్భిణీలకు, బాలింతలకు పోషకాహారం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ‘ఆరోగ్య లక్ష్మి’ కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టింది. ఈ పథకం ద్వారా అంగన్‌ వాడీ కేంద్రాలలో వేడి వేడిగా వండిన భోజనాన్ని అందిస్తోంది. ఈ కార్యక్రమాన్ని సీఎం చేతుల మీదుగా 2015 లో ప్రారంభించారు. ఆరోగ్య లక్ష్మీ పథకంతో తొమ్మిదేండ్లలో సుమారు 36,26,603 మంది మహిళలు లబ్ది పొందారు. దీంతో పాటు చిన్నారుల్లో తీవ్ర పౌష్టికాహార లోపాలను అరికట్టడానికి ప్రభుత్వం ” బాలామృతం ప్లస్‌” అనే పథకాన్ని కూడా ప్రవేశ పెట్టింది. అదనపు కార్బోహైడ్రేట్స్‌ తో పాటు ప్రోటీన్లు, సూక్ష్మ పోషకాలు పిల్లలకు అందేలా దీన్ని రూపొందించారు. అంగన్‌ వాడి కేంద్రాల్లో నమోదైన చిన్నారులకు బాలామృతం ప్లస్‌ను అందించడంతో పాటు వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. ఈ పథకాన్ని ఆసిఫాబాద్‌- కొమరంభీం, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన తర్వాత అన్నీ జిల్లాలకు విస్తరించారు. పాఠశాల బయట ఉన్న కౌమార దశ, (11-14 వయస్సు మధ్యలో ) ఉన్న ఆడ పిల్లలకు, ఇతర అవసరాలున్నవారికి పోషకాహార కిట్లను ప్రభుత్వం అందచేస్తుంది. దానిలో గోధుమలు, నెయ్యి, ఖర్జూరాలు, ప్రొటీన్‌ బిస్కెట్లు, ఐరన్‌, జింక్‌ సిరప్‌, మల్టీ విటమిన్ల మాత్రలు ఉంటాయి.
గిరిజన సంక్షేమ శాఖ, మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ సంయుక్తంగా ఇక్రిశాట్‌ శాస్త్రీయ సహకారంతో ఈ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నది. తక్కువ బరువు, పెరుగుదల లో లోపం, రక్త హీనత, కలిగిన గిరిజన పిల్లలు, కౌమార దశ బాలికలు, గర్భిణీలు, బాలింతలకు ఈ గిరిపోషణ కార్యక్రమాన్నివర్తింప చేశారు. ఉట్నూర్‌, భద్రాచలం, మన్నూరులలో సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) పరిధిలోని ప్రాంతాల్లో శిశువులు, గర్భిణీలు, కౌమార దశ ఉన్న ఆడ పిల్లలకు హైడ్రేట్‌ పోషకాహారాన్ని అందిస్తున్నది. మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ చేపట్టే కార్యక్రమాలలో ప్రీ- ప్రైమరీ విద్యాబోధన కీలక భూమిక పోషిస్తోంది. పూర్వ ప్రాథమిక విద్యను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం 2019 లో పాఠ్య ప్రణాళికలో మార్పులు చేసింది. అంగన్‌ వాడీ టీచర్లకు నెలనెలా పుస్తకాలను అందిస్తు న్నది. తంగేడు పూల పేరిట నాలుగు పుస్తకాలు, పాలపిట్ట పేరిట ఐదు పుస్తకాలను ఎల్‌కేజీ, యూకేజీలో చేరిన విద్యార్థులకు విధిగా ప్రభుత్వం అందిస్తోంది. పూర్వ ప్రాథమిక విద్యా పాఠ్య ప్రణాళికలో వీడియోలు, ఆడియో కార్యక్రమాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. సమగ్ర పిల్లల రక్షణ పథకం (ఐసీపీఎస్‌) రాష్ట్రంలోని 33 జిల్లాల్లో బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి వీలుగా బాలరక్షక్‌ వాహనాలను ఏర్పాటు చేసి, రెస్క్యూ ఆపరేషన్స్‌లో వాడుతున్నది. దేశంలోనే మొట్టమొదటి సారిగా వివిధ కార్పొరేట్‌ సంస్థలు, ఎన్‌జీవోల సహకారంతో అందిన నిధులతో వాహనాలను కొనుగోలు చేసి, రెస్క్యూ ఆపరేషన్ల లో వినియోగిస్తున్నారు. రక్షక భవనాలను ఏర్పాటు చేయడం ద్వారా ఒకే గొడుగు కింద బాలల రక్షణ చర్యలను చేపట్టింది.
గృహహింస, వేధింపులు, దాడులు, ప్రమాదాలకు గురైన మహిళకు తక్షణ వైద్యం, న్యాయం, ఆర్థిక సాయం అందించే లక్ష్యంతో వన్‌ స్టాప్‌ సెంటర్‌ ” సఖి”ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2017లో ప్రారంభమైన ఈ కేంద్రాల ను అన్ని జిల్లాలకు విస్తరింపజేసింది. వీటితో మహిళలకు బహుముఖ సేవలు అందజేస్తుంది. ఈ కేంద్రంలో మహిళకు ఐదు రోజుల పాటు అత్యవసర ఆశ్రయం కల్పిస్తుంది. సఖి కేంద్రాలు 24/7 పాటు పని చేస్తాయి.
ప్రత్యేకంగా మహిళా ప్రయాణీకుల రక్షణ/రవాణా కోసం ప్రభుత్వం 16 షీ టాక్సీలను ప్రవేశపెట్టింది. 16 మంది మహిళా డ్రైవర్లు ఈ టాక్సీలను నడుపుతూ మహిళా ప్రయాణీకులకు రక్షణగా ఉంటున్నారు. షీ టాక్సీలను 35 శాతం సబ్సిడీతో ప్రభుత్వం అందిస్తోంది. మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ తన వాటాగా 35 శాతం సబ్సిడీ, 10 శాతం మార్జిన్‌ మనీతో మహిళా క్యాబ్‌ డ్రైవర్లను క్యాబ్‌లు కొనుగోలు చేసేందుకు ప్రోత్సహిస్తుంది. దేశంలోనే మొట్ట మొదటిసారిగా ప్రభుత్వం మహిళల కోసం మోటార్‌ డ్రైవింగ్‌ స్కూల్‌ను రూ.49 లక్షలు వెచ్చించి స్థాపించింది.
మహిళలు సర్వతోముఖాభివృద్దిగా చెందినపుడే సమాజం అభివృద్ది చెందుతుంది. అనే నమ్మకంతో స్వయం సహాయక సంఘ మహిళలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. స్వయం సహాయక బృంద మహిళల ఆర్ధిక స్వావలంభన కోసం బ్యాంక్‌ లింకేజీ ద్వారా వారికి రుణాలను విరివిగా ఇచ్చేలా చర్యలు చేపట్టింది. రాష్ట్రం ఏర్పడిన తరువాత బ్యాంకులు స్వయం సహాయక బృందాలకు ఇచ్చే ద్రవ్య సహాయం మూడింతలు పెరిగింది. 2014-15 సంవత్సరం లో బ్యాంకులు స్వయం సహాయక బృందాలకు రూ.3,738.67 కోట్ల రుణాలు ఇవ్వగా, 2022-23 నాటికి అది రూ. 12,722.14 కోట్లకు చేరుకుంది. స్వయం సహాయక బృందాల సభ్యులు, బృందాల గ్రామ స్థాయి సంస్థల ఆర్ధిక లావాదేవీలను నమోదు చేసేందుకు మొబైల్‌ అకౌంటింగ్‌ యాప్‌ను కూడా రూపొందించినట్టు సమాచార పౌరసంబంధాల కమిషనర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.
ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి..
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మహిళా దినోత్సవ కార్యక్ర మాల ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంగళవారం హైదరాబాద్‌ లోని రవీంద్ర భారతిలో సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభం కానున్నాయి.ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌,విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, హోంశాఖ మంత్రి మహముద్‌అలీ, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మహిళా కమిషన్‌ చైర్మెన్‌ సునితా లక్ష్మారెడ్డి, మేయర్‌ గద్వాల విజయ లక్ష్మి, మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్మెన్‌ ఆకుల శ్రీలత పాల్గొంటారు. కార్యక్రమంలో కిషోరామృతం, ఆరోగ్య లక్ష్మి తదితర కార్యక్రమాలు ప్రారంబిస్తారు.

Spread the love