నవతెలంగాణ-హైదరాబాద్ : అనంతపురం పోలీసులు గురువారం మధ్యాహ్నాం భారీగా కరెన్సీని పట్టుకున్నారు. నాలుగు కంటైనర్ల నిండా రూ. 5 వందల నోట్లతో కూడిన సుమారు రూ. 2 వేల కోట్ల కరెన్సీని పట్టుకోవడం సంచలనం కలిగిస్తోంది. అనంతపురం పామిడి వద్ద 44 నంబర్ జాతీయ రహదారిపై వాహనాల తనిఖీ చేస్తుండగా నాలుగు కంటైనర్లలో రెండు కంటైనర్లు పోలీసులను దాటి వెళ్లిపోగా మరో రెండింటిని పోలీసులు ఆపి తనిఖీ చేశారు. ఈ తనిఖీలో భారీగా కరెన్సీని గుర్తించారు.. ప్రతి కంటైనర్ వాహనానికి పోలీస్ అని స్టిక్కర్ ఉండడంతో స్థానిక పోలీసులు, ఎన్నికల అధికారులు రికార్డులను పరిశీలిస్తున్నారు. పట్టుకున్న కరెన్సీ వివరాలను జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం అందజేశారు. భారీ మొత్తంలో నగదును రవాణా చేస్తుండగా కనీసం జిల్లా అధికారులకు సమాచారం అందించాల్సి ఉండగా ఇదేమి లేకుండా రవాణా చేయడం వెనుక అనుమానాలకు తావిస్తుంది. కాగా కరెన్సీని కొచ్చి నుంచి హైదరాబాద్ లోని ఆర్బీఐ కార్యాలయానికి నాలుగు ప్రయివేటు బ్యాంకులు డిపాజిట్ చేసేందుకు తీసుకెళ్తున్నట్లు సమాచారం.