ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌కు స‌మ‌న్లు జారీ చేసిన సిట్‌

నవతెలంగాణ – బెంగళూరు: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కర్ణాటక సెక్స్‌ స్కాండల్‌ కేసులో ఇవాళ కూడా ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌కు ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం స‌మ‌న్లు జారీ చేసింది. విచార‌ణ‌కు హాజ‌రుకావాల‌ని తాజా స‌మ‌న్ల‌లో ఆదేశించింది. విచార‌ణ‌కు హాజ‌ర‌య్యేందుకు ఏడు రోజుల స‌మ‌యం కావాల‌ని ప్ర‌జ్వ‌ల్ పెట్టుకున్న అభ్య‌ర్థ‌న‌ను సిట్ కొట్టిపారేసింది. ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌కు చెందిన అశ్లీల వీడియోల‌కు చెందిన కేసును సిట్ ద‌ర్యాప్తు చేప‌డుతున్న విష‌యం తెలిసిందే. 24 గంటల్లోగా ఎస్పీ సీమా లాట్కార్‌ ముందు హాజరుకావాలని నిన్న సిట్ ఆదేశాలు జారీ చేసింది. సెక్స్‌ స్కాండల్‌ వెలుగులోకి వచ్చిన కొద్ది గంటల్లోనే ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ డిప్లొమాటిక్‌ పాస్‌పోర్ట్‌ ఉపయోగించి ఏప్రిల్‌ 28న జర్మనీ పారిపోవటం రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. అతడి పాస్‌పోర్ట్‌ రద్దు చేసి, ప్రజ్వల్‌ను భారత్‌కు రప్పించటంలో సాయం చేయాలని ప్రధాని మోడీని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కోరారు. తనపై వస్తున్న ఆరోపణలపై ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ తొలిసారి స్పందించాడు. త్వరలోనే వాస్తవాలు బయటకు వస్తాయని వ్యాఖ్యానించాడు. సిట్‌ ముందు హాజరుకావడానికి 7 రోజుల సమయం కావాలని, ఇప్పుడు తాను బెంగళూరులో లేనట్లు అత‌ను ఎక్స్‌లో సందేశాన్ని పోస్ట్‌ చేశాడు. ద‌ర్యాప్తున‌కు ప్ర‌జ్వ‌ల్‌ హాజ‌రుకాక‌పోవ‌డంతో లుకౌట్ నోటీసులు జారీ చేశారు.

Spread the love