తెలంగాణ వ్యాప్తంగా వడదెబ్బతో నలుగురి మృతి

నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో సోమవారం రోజున ఎండలు దంచికొట్టాయి. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా వేడితో ఉడికిపోయింది. జగిత్యాల జిల్లా అల్లీపూర్‌, గుళ్లకోటలలో రాష్ట్రంలోనే అత్యధికంగా 46.8 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వడగాలులు కూడా విపరీతంగా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని తెలిపారు. వడదెబ్బకు సోమవారం రోజున రాష్ట్ర వ్యాప్తంగా నలుగురు మరణించారు. అయితే సోమవారం పగలంతా సూర్యుడి తన ప్రతాపంతో అల్లాడిస్తే.. రాత్రి మాత్రం కాస్త చల్లబడింది. ఇక మంగళవారం తెల్లవారుజామున చాలా ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షానికి మామిడి, అరటితోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మరోవైపు రాష్ట్రంలో మంగళ, బుధ, గురువారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది. మంగళవారం నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, జనగామ, యాదాద్రి జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి.

Spread the love