హైదరాబాద్‌లో 48 ఎకరాలు రూ. 267 కోట్లకు కొన్న మైక్రోసాఫ్ట్

నవతెలంగాణ-హైదరాబాద్ : టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ హైదరాబాద్‌లో 48 ఎకరాల స్థలాన్ని దాదాపు రూ. 267 కోట్లకు కొనుగోలు చేసింది. రంగారెడ్డి జిల్లాలో సాయి బాలాజీ డెవలపర్స్ నుంచి ఈ స్థలాన్ని కొనుగోలు చేసినట్టు డేటా అనలిటికల్స్ సంస్థ ప్రోప్‌స్టాక్ తెలిపింది. తన డేటా సెంటర్ బిజినెస్‌ను మరింత విస్తరించాలని భావిస్తున్న మైక్రోసాఫ్ట్ తమ అతిపెద్ద డేటా సెంటర్లలో ఒకదాన్ని ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయాలని భావిస్తోంది. అందులో భాగంగానే ఈ భూమిని కొనుగోలు చేసినట్టు తెలిసింది. ప్రస్తుతం ఆ సంస్థ కొనుగోలు చేసిన భూమి హైదరాబాద్‌కు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు ఈ డీల్‌తో సంబంధం ఉన్న వ్యక్తి ఒకరు తెలిపారు. మైక్రోసాఫ్ట్‌కు ఇండియాలో ప్రస్తుతం పూణె, ముంబై, చెన్నైలో డేటా సెంటర్లు ఉన్నాయి. ఇప్పుడు దీనికి అదనంగా హైదరాబాద్‌లో నెలకొల్పనుంది. డేటా సెంటర్ బిజినెస్ కోసం హైదరాబాద్‌లో మరో రెండు ల్యాండ్ పార్శిళ్లను కూడా మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేసినట్టు ఆయన పేర్కొన్నారు.

Spread the love