హైదరాబాదులో ప్రపంచ దిగ్గజ సంస్థ గోల్డ్ మెన్ సాక్స్ భారీ విస్తరణ

– ఇప్పుడున్న సిబ్బందికి రెండు రెట్లు అదనంగా ఉన్నత నైపుణ్యం కలిగిన నిపుణులతో తన కార్యకలాపాలను విస్తరించనున్న కంపెనీ
– అదనంగా 2000 మంది నిపుణులకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్న సంస్థ
– అమెరికాలోని న్యూయార్క్ నగరంలో మంత్రి కేటీఆర్ తో జరిగిన సమావేశం అనంతరం కంపెనీ నిర్ణయం
నవతెలంగాణ -హైదరాబాద్
సంస్థ విస్తరణ ప్రణాళికలతో బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ రంగంలో హైదరాబాద్ స్థానం మరింత బలోపేతం అవుతుందన్న విశ్వాసం వ్యక్తం చేసిన కేటీఆర్
తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వచ్చి చేరింది. అంతర్జాతీయ బ్యాంకింగ్, ఫైనాన్స్ దిగ్గజ సంస్థ గోల్డ్ మెన్ సాక్స్ తెలంగాణలో తన భారీ విస్తరణ ప్రణాళికలను ప్రకటించింది. ఈరోజు తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కే. తారక రామారావుతో అమెరికాలోని న్యూయార్క్ నగరంలోని కంపెనీ కేంద్ర కార్యాలయంలో సంస్థ చైర్మన్ సీఈవో డేవిడ్ ఎం సోలమన్ బృందంతో జరిగిన సమావేశం అనంతరం కంపెనీ ఈ మేరకు తన ప్రకటనను వెలువరించింది. గోల్డ్ మెన్ సాక్స్ సంస్థ హైదరాబాద్ నగరంలో తన కార్యకలాపాలను పెద్ద ఎత్తున విస్తరించేందుకు సంసిద్ధంగా ఉన్నామని తెలిపింది. ఈరోజు సంస్థ ప్రకటించిన తన విస్తరణ ప్రణాళికలలో భాగంగా ప్రస్తుతం ఉన్న 1000 ని మరో రెండు రెట్లు పెంచి 2000మంది నిపుణులకు అదనంగా ఉద్యోగ అవకాశాలను అందించనుంది. ఇందుకోసం సుమారు మూడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కార్యాలయాన్ని/విస్తరణను చేపట్టనున్నది. సంస్థ బ్యాంకింగ్ సేవలు, బిజినెస్ అనలిటిక్స్, ఇంజనీరింగ్ వంటి వివిధ రంగాలలో గోల్డ్ మెన్ సాచ్ సంస్థ కార్యకలాపాల బలోపేతం కోసం ఈ నూతన కేంద్రం పనిచేయనున్నది. తమ సంస్థ కార్యకలాపాలకు అనుగుణంగా కావాల్సిన ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ విభాగాల్లోనూ హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్న నూతన కార్యాలయం ప్రధానంగా దృష్టి సారిస్తుందని గోల్డ్ మెన్ సాచ్ సంస్థ తెలిపింది.
హైదరాబాద్ నగరంలో బ్యాంకింగ్,ఫైనాన్స్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగాల ఈకో సిస్టం బలంగా ఉన్నదని, దీనికి అదనంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహక పూరిత విధానాలు, హైదరాబాద్ నగరంలో ఉన్న పెట్టుబడుల అనుకూల వాతావరణం వలన తమ విస్తరణ ప్రణాళికలను ప్రకటిస్తున్నట్లు సంస్థ చైర్మన్ సీఈవో డేవిడ్ ఎం సోలోమన్ తెలిపారు. హైదరాబాద్ నగరంలో తమ నూతన కార్యాలయం, తమ ఇన్నోవేషన్ లక్ష్యాలకు, కార్యకలాపాలకు అనుగుణంగా పనిచేస్తుందని తెలిపారు. 2021 జులై నెల నుంచి హైదరాబాద్ నగరంలో తన కార్యకలాపాలు ప్రారంభించిన సంస్థ, అప్పటినుంచి వేగంగా తన విస్తరణ ప్రణాళికలకు సంబంధించిన అంశాన్ని పరిశీలిస్తూ వస్తుంది. అయితే గత పది సంవత్సరాలలో హైదరాబాద్ నగరం సాధించిన అద్భుతమైన ప్రగతి, ముఖ్యంగా పెట్టుబడుల అంశంలో సాధించిన పరిశ్రమ స్నేహపూర్వక వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని తమ విస్తరణ చేస్తున్నట్లు సంస్థ ఈరోజు ప్రకటించింది. ఇప్పటికే తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్న హైదరాబాద్ కార్యాలయం సంస్థగతంగా అంతర్జాతీయ ఖ్యాతిని అందుకున్నదని సంస్థ చైర్మన్ ప్రశంసించారు. ఈ విస్తరణతో హైదరాబాద్ నగరంలో తమ సంస్థ సిబ్బంది మొత్తం మూడు రెట్లు అవుతుందన్నారు.
బిఎఫ్ ఎస్సై (BFSI) రంగాల్లో హైదరాబాద్ నగరాన్ని అత్యుత్తమ పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇప్పటికే ప్రపంచ ఆర్థిక బ్యాంకింగ్ ఫైనాన్స్ సేవల్లో అత్యంత ప్రతిష్ట కలిగిన మాస్ మ్యూచువల్,హెచ్ ఎస్ బి సి, స్టేట్ స్ట్రీట్ ,బెర్కాడియా వేల్స్ ఫార్గో, జేపీ మోర్గాన్ వంటి కంపెనీలు హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున తమ కార్యకలాపాలను విస్తరించిన విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. ఈరోజు గోల్డ్ మెన్ సాక్స్ సంస్థ విస్తరణ ప్రణాళికలు ప్రకటించడం ద్వారా ఈ రంగంలో హైదరాబాద్ స్థానం మరింత బలోపేతం అవుతుందని తెలిపారు. ఈ సందర్భంగా సంస్థ విస్తరణ ప్రణాళికలో భాగంగా 2500 మంది అత్యంత నైపుణ్యం కలిగిన యువకులకు ఉద్యోగాలు లభించనుండడం పట్ల కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. నగరాన్ని తన విస్తరణ కోసం ఎంచుకున్న సంస్థ ప్రతినిధుల బృందానికి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.

Spread the love