అక్షరమే ఆయన ఆయుధం

ఆయన గొప్ప రచయిత, బహు భాషా కోవిదుడు. నిరంతరం పుస్తకాలతోనే గడిపేవారు. ముక్కు సూటిగా స్పష్టంగా మాట్లాడేవారు. తెలంగాణ పోరాటాన్ని కళ్ళారా చూసిన సాహితీ యోధుడు. ఆయనే డాక్టర్‌ దాశరథి రంగాచార్య. ఈ పేరు ప్రజలందరికీ సుపరిచితమే. ఇక్కడి ప్రజల జీవన పోరాటాన్ని, అస్తిత్వాన్ని తన రచనల ద్వారా ప్రతిఫలింపజేశాడు. 1928 ఆగస్ట్‌ 24న దాశరథి వెంకటాచార్యులు-వెంకటమ్మ దంపతులకు మహబూబాబాద్‌ జిల్లా చిన్నగూడూరు మండలకేంద్రంలో జన్మించారు. పుట్టింది పండిత కుటుంబమే అయినా అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. 12ఏళ్ల వయస్సులోనే నిజాం సర్కార్‌కు వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారు. నిజాంకు వ్యతిరేకంగా పనిచేసిన ఆంధ్ర మహాసభ, ఆర్య సమాజ్‌ పోరాటాలకు ఆకర్శితులై వాటి తరపున ఎన్నో ఉద్యమాల్లో పాల్గొని జైలు జీవితం కూడా గడిపారు. వీరి అన్న దాశరథి కృష్ణమాచార్యుల నుంచి అభ్యుదయ భావాలను అలవర్చుకున్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఇద్దరూ కలిసి సైనికులుగా పనిచేశారు. భూమి, భుక్తి, వెట్టి చాకిరి విముక్తి కోసం నిజాం సర్కార్‌కు వ్యతిరేకంగా పోరాడారు. తెలంగాణ ఉద్యమ జీవితాన్ని సాహిత్య రూపంలో ప్రజలకు అందించారు రంగాచార్య. తెలుగు సాహిత్య చరిత్రలో తొలిసారిగా నాలుగు వేదాలను తెలుగులోకి అనువదించి అభినవవ్యాసునిగా పేరుగాంచారు. ”చిక్కుల్లోనే మనిషి ఎదుగుతాడు… ఆపదల్లోనే ఉన్నతుడవు తాడు… మనిషైనా జాతైనా అంతే…” అన్న డాక్టర్‌ దాశరథి రంగాచార్య తెలంగాణ రైతాంగ పోరాటం ఆయుధాలను చేతబూనడం వలన వారు పోలీసు యాక్షన్‌ తర్వాత బయటికి వచ్చారు.
రంగాచార్య మొత్తం తొమ్మిది నవలలు రాశారు. ”చిల్లర దేవుళ్లు”, మోదుగుపూలు”, ”మాయజలతారు”, ”జనపదం”, ”రానున్నది ఏది నిజం”, ”మానవత”, ”శరతల్పం”, ”పావని”, ”అమృతంగమయ”. తెలంగాణ గురించి రాయబడిన దాశరథి రంగాచార్య తొలి నవల ”చిల్లర దేవుళ్లు”. ఐదువారాల్లోనే పూర్తి చేశారు. అక్షరమే ఆయన ఆయుధం, తెలంగాణ సాయుధ పోరాటంలో ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమ కెరటం, తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎలుగెత్తి చాటిన అభ్యుదయవాది, తన రచనలతో నిజాం నిరంకుశత్వాన్ని ఎదురించిన వీరుడు. సాహిత్య సాగరంలో ఆయన ఉరికే కెరటం. తన రచనలతో సమాజాన్ని చైతన్యం చేసిన అక్షర వాచస్పతి. వేదం జీవన నాదం అంటూ వేదాలను ప్రజాజీవితంలోకి తెచ్చి వచన రూపంలో అందించిన సాహితీ పిపాసి. నవ సమాజం కోసం తాపత్రయపడిన ఉద్యమశీలి. ప్రజా ఉద్యమంలో వేద భారతాన్ని అన్వేషించిన అక్షర తపస్వీ. ఆయన శ్వాస, ధ్యాస అంతా మానవ శ్రేయస్సు గురించే. సమసమాజ ఆవిష్కరణ గురించే. సద్గుణ సంపన్ను డైన సద్గుణ మానవున్ని దర్శించాలన్నదే ఆయన మహా సంకల్పం. తెలంగాణ సాయుధ పోరాటంలో నిజాం సర్కార్‌కు ముచ్చె మటలు పట్టించారు రంగాచార్య. తెలంగాణ మట్టి జీవితాన్ని, వెట్టి జీవితాన్ని అక్షరాల్లోకి ఎలుగెత్తిచాటాడు. తన రచనలతో పోరాటాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా చేశారు.
1948లో పోలీస్‌ చర్య తర్వాత హైదరాబాద్‌కు విముక్తి లభించింది. సాయుధ పోరాటం విరమణ తర్వాత 1951లో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి 1957లో అనువాదకులుగా సికింద్రాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో చేరారు. సికింద్రాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్లో 32ఏళ్లు ఉద్యోగం చేసి అసిస్టెంట్‌ కమిషనర్‌ హోదాలో రిటైరయ్యారు. తన 40ఏండ్ల జీవితంలో అక్షర ప్రస్థానం ప్రారంభించి ఎన్నో నవలలు, గ్రంథాలు రాశారు. శ్రీమద్రామాయణం, మహా భారతాలను సరళంగా తెలుగులో రాశారు రంగాచార్య. తన ఆత్మకథగా వచ్చిన జీవనయానం కూడా తెలంగాణ ఉద్యమం, ప్రజల జీవన స్థితిగతులను చాటి చెబుతోంది. వేదవ్మాయాన్ని ప్రజలందరికి చేర్చడానికి అభ్యుదయ దృక్పథమే తనను పురిగొల్పిందని ఆయన చెప్పుకున్నారు. వేదాలను స్త్రీలు, శూద్రులు చదవకూడదనే దృక్పథాన్ని ఆయన తోసిపుచ్చారు. దాశరథి రంగాచార్య జీవన యానం చదివితే మొత్తం ఆయన్ను చదివినట్టే. తెలంగాణ సమాజాన్ని అన్ని కోణాలలో సమగ్రంగా చదివినట్టు, ఒడ్డున కూర్చుని పుంఖాను పుంఖాలుగా రచనలు చేసిన వారికి పూర్తి భిన్నంగా, తెలంగాణ కవుల సంప్రదాయానికి అనుగుణంగా స్వయంగా నిజాం వ్యతిరేక సాయుధ పోరాటంలో పాల్గొని ప్రజలపక్షం నిలిచారు. తన నెత్తిపై నుంచి తుపాకి గుండు దూసుకుపోయినా చలించని ధీశాలి రంగాచార్య.
రంగాచార్య రచించిన చిల్లర దేవుళ్లు పలు భాషల్లోకి అనువాదమైంది. దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం కూడా వచ్చింది. ‘అభినవవ్యాసుడిగా’ బిరుదు అందుకున్న రంగాచార్య 2015 జూన్‌ 8న కన్నుమూశారు.ఆయన స్మరణార్థం మహబూబాబాద్‌ జిల్లాకు దాశరథి జిల్లాగా పేరు పెట్టాలనే డిమాండ్‌ ఉన్నది. ఆయన కాంస్య విగ్రహాన్ని అన్ని జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేయాలని ప్రజల కోరిక. జయంతిని అధికారికంగా జరపాల్పిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది.
(నేడు దాశరథి రంగాచార్య జయంతి)

Spread the love