ఎదురుదాడి సమస్యకు పరిష్కారమా?

Is counter-attack the solution?”ఉపన్యాస విన్యాసాలతో దేశ ప్రజల శిరస్సులకు చేతబడి జరుగుతుంది” అని ఓ కవి పలికినట్లు.. మణిపూర్‌ ఘటనలు ఒక ఎత్తైతే దాని పర్యవసానాలు దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలపై చూపుతున్న ప్రభావం మరింత ప్రమాద ఘంటికలు మోగిస్తున్నది. మణిపూర్‌పై ప్రధాని నోరు విప్పడానికి ఏకంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించాల్సి వచ్చింది. అయినప్పటికీ దిద్దుబాటు చర్యలుండబో తున్నాయన్న సంకేతాలు రాలేదు సరికదా, పూర్తిగా ప్రతి విమర్శలకే పరిమితమయ్యారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్లు సాక్షాత్తూ ప్రధానియే ప్రశ్మ్నించిన వారిపై ఎదురు దాడికి దిగితే పరివారమంతా అదే చేస్తుందిగా! రాహుల్‌ గాంధీ చేసిన ఒక సంజ్ఞ ఒక ఫ్లయింగ్‌ కిస్‌గా కనిపించి భంగపడిన స్మృతీ ఇరానీ గారికి మహిళలను నగంగా ఊరేగించినా బాధ కలగలేదు!
కేంద్రంలోని బీజేపీ పాలనలో చోటు చేసుకుంటున్న ప్రధాన మార్పు ఏమంటే జరిగిన అన్యాయాన్ని వ్యతిరేకించిన వాళ్లపై దాడి జరుగుతుంది. వండివార్చిన అభిప్రాయాలను ప్రజల ఆలోచనలపై నిండుకుండలా కుమ్మరించి అంధభక్తులను తయారు చేయడంలో నేటి మితవాద పాలకులు సఫలీకృతం అవుతున్నారు. ఇద్దరు మహిళలను వివస్త్రలను చేసి అంగాంగ ప్రదర్శన చేయడమే కాకుండా వాటిని తమ వికత చేష్టలతో తడుముతూ బహిరంగ మానభంగం చేసి హతమార్చిన ఘటనను దేశం కళ్ళారా చూసింది. జరిగిన 72రోజుల తర్వాత గాని ఈ అంశం బాహ్య ప్రపంచం దృష్టికి రాలేదు. ఇలాంటి సంఘటనలు మరొక రాష్ట్రంలో జరగలేదా, మానభంగాలు, మర్డర్లు మరెక్కడా జరగలేదా? అంటూ సమర్థించుకుంటున్నారు. అబలలపై జరిగిన ఆకృత్యాలను సమర్థించుకునేదా సంస్కారం అంటే? ఇది ఒక్కటే కాకుండా మహిళలకు జరిగిన అన్యాయాలపై తిరగబడిన ఒక యువకుడి తల నరికి ఇంటి ముందున్న తడికెకు వేలాడదీసిన ఫొటో జూలై 22న ఒక పత్రికలో దర్శనమిచ్చింది. వెంటనే భక్తులు రంగంలోకి దిగి ”కాశ్మీరీ పండిట్లకు జరిగిన అన్యాయం సంగతి చెప్పండి” అంటున్నారు. జరుగుతున్న అన్యాయా లన్నింటికీ చారిత్రక తప్పిదాలే సమాధానాలా? తెలంగాణకు చెందిన ఐఏఎస్‌ స్మితా సబర్వాల్‌ లాంటివాళ్లు ట్విట్టర్‌ వేదికగా ఈ అంశాన్ని ఖండిస్తే వారిని అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు. ఇదేనా సంస్కారమంటే? జగన్మాత, భారతమాత, కాళీమాత అంటూ ఏవేవో పేర్లు పెట్టి మహిళలకు గౌరవం ఇస్తున్నట్టుగా ఫోజులు కొట్టేవాళ్లు మహిళలపై జరుగుతున్న దాడులను కనీసం ఖండించడానికి మొహం చాటేస్తున్నారు ఇది సిగ్గుచేటు కాదా? మత ఛాందసవాదులు రాజకీయాలను మతంతో ముడిపెట్టి, మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలను నడిపిస్తున్న నేటి పాలకులు వారి అనుయాయులు, వారి మాధ్యమాలు ఎన్నడూ మహిళల గౌరవానికి ప్రాధాన్యత నివ్వలేదు, ఇవ్వలేరు కూడా. ఎందుకంటే ఆధిపత్య భావజాలంలో అది అసాధ్యం. ”ఎత్తి చూపిన పాలిండ్లు కరుణ చూపని కఠిన శిలలయ్యే వరకూ, గగుర్పొడిచేలా గరళ బీజాలు నాటిన గర్భసంచుల్లో గన్నేరు కాయలు కాసే వరకూ, ఈ యాత్ర ఇలాగే కొన సాగుతోంది” అంటూ కవయిత్రి పాటిబండ్ల రజిని చెప్పిన ఆగ్రహ వాక్యాలు నిజమనిపిస్తున్నవి.
ఇక తమ ఆగడాలను కప్పిపుచ్చుకోవడానికి దేశం, మతం అభద్రతలో ఉన్నాయనే ముసుగును కప్పుకుంటున్నారు. దేశంలోకి మయన్మార్‌ ప్రాంతం నుండి రోహింగ్యాలు చొరబడుతున్నారని, ఇది మయన్మార్‌, చైనా దేశాల కుట్ర అంటూ అసత్య ప్రచారాలతో ఊదరగొడుతున్నారు. తొమ్మిదేండ్ల నుంచి పాలిస్తున్న వారు, దేశ సరిహద్దులను తమ హద్దులలో పెట్టుకున్న వారు, ఈ మాట అంటుంటే నమ్మడానికి మనకున్న వివేకం ఏమైనట్టు? ప్రతి సంఘటనను విదేశీ కుట్రతో ముడిపెట్టడం కుసంస్కారం కాదా? ఇక మణిపూర్‌లో హిందూ మతం అభద్రతలో పడిందంటూ క్రైస్తవ మతం ఆధిపత్యం చెలాయిస్తుందంటూ మరో అసత్య వాదనకు నిస్సిగ్గుగా తెరదీస్తున్నారు. మూడు నెలల నుంచి జరుగుతున్న హింసాత్మక ఘటనలు ప్రపంచ దృష్టిని ఆకర్షించి భారతదేశ పరువును బజార్లో పెట్టాయి. భారత్‌లో మతసహనం లేదని ఒక్క మణిపూర్‌ రాష్ట్రంలో 250చర్చిలకు పైగా కూల్చ బడ్డాయని ఐక్యరాజ్యసమితిలో చర్చ జరిగింది. యూరోపియన్‌ యూనియన్‌ పార్లమెంట్‌లో, ఇంగ్లాండ్‌ లోని హౌస్‌ ఆఫ్‌ కామన్‌ సభలో ఇదే రకమైన చర్చ జరుగుతోంది. ఇలాంటి పర్యవసానాలు దేశానికి నష్టదాయకం కావా? అసలు పరిస్థితి ఇంత దాకా ఎందుకు వచ్చింది. ”ఏ స్టిచ్‌ ఇన్‌ టైం సేవ్స్‌ నైన్‌” అనే ఇంగ్లీషు సామెత అర్థం ఏమంటే సరైన సమయంలో స్పందిస్తే సమస్య పెరిగి పెద్దది కాదు అని. సరైన సమయంలో స్పందించకపోవడమే కాక రాష్ట్ర ప్రభుత్వం వహించిన అలసత్వం, రిజర్వేషన్లపై కోర్టు తీర్పును పునఃసమీక్షించని విధానం, ఈ దుస్థితికి దారితీసాయి. ఒక రాష్ట్రంలోని ఎన్నికల దృష్ట్యా వ్యవసాయ సంస్కరణల నల్ల చట్టాలపై వెనక్కి తగిన కేంద్రం మణిపూర్‌ అంశంలో అదే చొరవ చూపలేకపోయింది. మణిపూర్‌ ప్రజలపై నిప్పుల వర్షం కురుస్తుంటే కర్నాటక ఎన్నికల ర్యాలీలో పూలజల్లు కురిపించుకోవడానికి ఇష్టపడిన పెద్దలు దీనికి బాధ్యత వహించాలి. ఒక అమ్మాయిని దుశ్శాసనులంతా కలిసి నగంగా ప్రదర్శిస్తున్న అంశాన్ని కళ్ళారా చూసిన తర్వాత గాని పెద్ద మనిషికి నోరు పెగలలేదు. తెరిచినా ఆ నోటి తుంపరలు పక్క రాష్ట్రాలపై వెదజల్లెందుకు తహతహలాడాయి.
ఈ సందర్భంగా చరిత్రను ఒకసారి గమనించాలి. 1946లో బెంగాల్‌ ప్రావిన్స్‌లోని నొవాకలి ప్రాంతంలో జరిగిన మత ఘర్షణలు అత్యంత దారుణమైనవి. ముస్లిం లీగ్‌, హిందూ మహాసభలు భారతదేశ వేరువేరు మత రాజ్యాలుగా ఉండాలని ప్రజల్లో నూరి పోయడంతో, క్షేత్రస్థాయిలో అవి మత ఘర్షణలకు దారితీసాయి. ముస్లింలు మెజారిటీగా ఉన్న ఆ ప్రాంతంలో అనేకమంది హిందువులను ప్రభుత్వ అండదండలతోనే ఊచకోత కోశారు. హిందువులు మైనారిటీలో ఉన్నప్పటికీ అనేకమంది హిందువులు భూస్వాములుగా చెలామణి అవుతూ ఉండేవారు. కానీ హిందువులను ఏనాడు వారు రక్షించడానికి ప్రయత్నం చేయలేదు. అరకొరగా అందిన వార్తల ఆధారంగా మహాత్మా గాంధీ ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించి విచారణ చేయసాగారు. కానీ అప్పటి బెంగాల్‌ ప్రభుత్వం అసత్య సమాచారాన్ని ఇస్తూ అంతా సవ్యంగా ఉంది అనే సంకేతాలను పంపింది. ఒకానొక రోజు గాంధీ ఆనాటి కాంగ్రెస్‌ అధ్యక్షులు జేబీ కృపలానిని బెంగాల్‌ సందర్శించడానికి ఆదేశించవలసి వచ్చింది. ఆయన తన సతీమణి సుచేత కృపలాని నీ వెంటబెట్టుకొని వెళ్లారు. అక్కడి దీన వ్యవస్థలోని ప్రజల ఆర్తనాదాలు అభ్యర్థనలు సుచేత కృపలాని నీ అక్కడే మరో ఆరు నెలలు ఉండేలా చేశాయి. పరిస్థితి సద్దుమణిగే వరకు సుచేత కృపలాని గారిని అక్కడే ఉంచి జేబీ కృపలాని ఢిల్లీ వెళ్లారు. మనందరికీ తెలుసు దేశమంతా స్వాతంత్య్ర సంబరాల్లో మునిగి ఉంటే, గాంధీ బెంగాల్‌లోని మత కలహాలను తగ్గించేందుకు అక్కడికి వెళ్లి మకాం వేసి, ప్రాణాన్ని పణంగా పెట్టి ప్రయత్నించారని. ఇలాంటి చరిత్రకు వారసులుగా ఉన్న నేటి పాలకులు నిమ్మకు నీరెత్తినట్లుగా తమకు గర్వభంగం అవుతా మోననే చీకటి గౌరవాన్ని తలపై మోస్తూ దేశాన్ని అప్రతిష్టపాలు చేస్తున్నారు. ఇది దేశ ప్రజలలో విపరీత వైషమ్యాలకు దారితీస్తున్నది. అందుచేత పంతాలు, పట్టింపుల కన్నా పరిష్కారానికి చొరవ చూపాల్సిన సమయం, సందర్భమిది.
-జి. సునితారాణి, సెల్‌:9951300016

Spread the love