కెనడాలో రోడ్డు ప్రమాదం..భారతీయ జంట, చిన్నారి మృతి

నవతెలంగాణ-హైదరాబాద్ : కెనడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతీయ జంట, వారి మూడు నెలల మనవడు దుర్మరణం చెందారు.ఆ కారులో ఉన్న చిన్నారి తల్లిదండ్రులు తీవ్ర గాయాలపాలయ్యారు. ఓంటారియోలో ఓ హైవేపై సోమవారం ఈ ప్రమాదం జరిగింది. మద్యం దుకాణంలో చోరీ చేసిన ఇద్దరు నిందితులు పోలీసులను నుంచి తప్పించుకునే క్రమంలో హైవేపై వ్యాన్‌లో రాంగ్‌రూట్‌లో వెళుతూ పలు కార్లను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నిందితుల్లో ఒకరు ఘటనా స్థలంలోనే మరణించినట్టు పోలీసులు తెలిపారు. చిన్నారి తల్లిదండ్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలిపారు. మృతులను మణివణ్ణన్ మహాలక్ష్మిగా గుర్తించారు. మనవడిని చూసేందుకు వారు కెనడా వెళ్లినట్టు తెలిసింది. చిన్నారి తల్లి దండ్రులు ఎజాక్స్‌లో నివసిస్తుంటారు. ఘటనపై టొరొంటోలోని భారతీయ కాన్సులేట్ విచారం వ్యక్తం చేసింది. బాధిత కుటుంబానికి సంతాపం తెలియజేసింది. ఈ ఘటనపై కెనడా అధికారులతో టచ్‌లో ఉన్నామని బాధిత కుటుంబానికి అన్నిరకాలుగా అండగా ఉంటామని పేర్కొంది. ఈ ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డ ఓ ప్రత్యక్ష సాక్షి తాను చూసింది మీడియాతో పంచుకున్నారు. ఎప్పటిలాగే ఆ హైవేపై కారులో వెళుతున్న తనకు నిందితులు రాంగ్‌రూట్లో ఎదురుగా వచ్చారని చెప్పారు. ఆ క్షణం తన కళ్లను తానే నమ్మలేకపోయానని ఆమె చెప్పారు. అది చాలా భయానక అనుభవమని చెప్పారు. మరోవైపు ఘటనపై కెనడా పోలీసులు ముమ్మర దర్యాప్తు ప్రారంబించారు. యాక్సిడెంట్ ఎలా జరిగిందనేది ఆరా తీస్తున్నారు. ప్రత్యేక బృందాలతో వివిధ కోణాలలో కేసును దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love