76ఏండ్ల స్వాతంత్య్ర ఫలాలు ఎవరివి?

 Who are the fruits of 76 years of independence?తీరని ప్రాధమిక అవసరాలు, పేదరికం, అసమానతల మధ్య ఏ ప్రజాస్వామ్యమైనా ఎక్కవ కాలం మనలేదు’ అని నెహ్రూ అన్నారు. మనం ప్రతినిత్యం ఒక మాట వింటుంటాం ‘మనది ఘనత వహించిన ప్రజాస్వామ్యం’ అనే మాట. పాలక వర్గాల అనుకూల కుహన మేధావులు అలసిపోకుండా ఈ ప్రజాస్వామ్యాన్ని పొగుడు తూనే ఉంటారు. ఇది నిజంగా ప్రజాస్వామ్య మేనా? అని నిశితంగా పరిశీలిస్తే ఇది ధనవంతులు, పెద్ద పెద్ద కార్పొరేట్లకే ప్రజాస్వామ్యమని తేలిపోతుంది. ఒక కఠినమైన వాస్తవం ఏమిటంటే… ఎవరి సేద్యంతో ఈ భూమి తడిసి దేశం నిర్మాణమైందో ఆ ప్రజల్ని దోచుకుంటూ, దోపిడీ వర్గాలు, పాలక వర్గాలు అనుభవిస్తున్న స్వతంత్రం, దశాబ్దాలుగా వ్యవస్థీకృతం చేస్తూ వచ్చిన హింసను అహింసగా చెలామణి చేస్తున్న స్వతంత్రం. చిన్న పాట ప్రశ్నను, ధిక్కారాన్ని, సంఘాన్ని, సమరాన్ని అసలు అడగటానికి ఒక చోట కలుసుకోవటాన్ని కూడా సహించలేని స్వాతంత్య్రం మనది. ఉఛ్వాస నిశ్వాసలకు పరిమితులు విధించి భయకంపితం చేసి మానవ సారాన్ని నిస్సారం చేసే స్వతంత్రం మనది. అందుకే మహా శ్వేతాదేవి ఈ ప్రజాస్వామ్యాన్ని ‘విధ్వంస స్వామ్యం’ అన్నారు. పాలకుల విధ్వంసక విధానాలను ప్రశ్నించే వారికి దేశంలో రక్షణ లేకుండా పోయింది. గోవుకు ఉన్న రక్షణ మనిషి బతుక్కి లేకుండా పోయింది. గోవు జాతియత, దేశభక్తి, సంస్కృతి పేరుతో రాజకీయాలు నడుస్తున్నాయి. కులం, మతం ఓట్లు రాల్చే సాధనాలుగా మారిపోయాయి. స్వతంత్ర రాజ్యాంగ వ్యవస్థలు (ఉదా:న్యాయవ్యవస్థ) స్వతంత్రంగా పనిచేసే పరిస్థితి కోల్పోయాయి. దేశంలో సైన్స్‌పై దాడి జరుగుతోంది. అయినా శాస్త్రవేత్తలు దీనిపై నోరుమెదపలేని స్థితి. కల్బుర్గీ, గోవింద పన్సారే, దబోల్కర్‌, గౌరి లంకేశ్‌ లాంటి హేతువాదులు, మేధావులు, జర్నలిస్టులు హత్యలకు గురయ్యారు. ఈ ఉదంతాలపై దర్యాప్తుల్లో పురోగతి లేకపోవటాన్ని ప్రశ్నిస్తూ దాఖలైన పిటీషన్లను విచారిస్తూ ముంబాయి హైకోర్టు ఘాటుగా స్పందిస్తూ ఇలా వ్యాఖ్యానించింది… ”ఎవరు మాట్లాడ లేని, ఎవరూ స్వేచ్ఛగా సంచరించలేని ఒక విషాదకర దశను దేశం చూస్తున్నదని న్యాయస్థానం మాట్లాడిందంటే పరిస్థితి ఎంత దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. దేశంలో జరుగుతున్న ఎన్‌కౌంటర్లు, లాకప్‌డెత్‌లు తెంపు లేకుండా మహిళలు, చిన్నపిల్లలపై జరుగుతున్న లైంగిక దాడులు మనదేశ ప్రతిష్టను మసక బారుస్తున్నాయి. స్వాతంత్య్రం వచ్చి నిన్న ఆగష్టు15కి 76సంవత్సరాలు పూర్తవుతాయి. ఇప్పటికి సమాజంలో ప్రజల కోణంలో అభివృద్ధి జరిగిందా? అంటే లేదని చెప్పాలి. ఇన్నేండ్లుగా మన మువ్వెన్నల జెండా రెపరెపలాడుతూ ఎగురుతూనే ఉంది. చెయ్యెత్తి జైకొడుతున్నాం. సెల్యూట్‌ చేస్తున్నాం, నిండుగా మనసులో గౌరవం నింపుకున్నాం, జాతీయగీతం ఆలపిస్తున్నాం. సగర్వంగా జాతీయోద్యమం గురించి, భగత్‌సింగ్‌ సుఖదేవ్‌, రాజ్‌గురు, అజాద్‌, అల్లూరి సీతా రామరాజు లాంటి త్యాగధనుల దేశ భక్తి గురించి, వారి వీరోచిత పోరాటాల గురించి పిల్లలకు చెబుతున్నాం. ఎంతో సాధించామని, ఇంకెతో సాధించాల్సినది ఉందని చెప్పుకుంటున్నాం. మిఠాయిలు పంచుకొని మువ్వెన్నల జెండాను గుండెకు హత్తుకొని సంబరపడుతున్నాం. కాని స్వాతంత్య్ర ఫలాలు అందరికి అందలేదనే విషయం గుర్తుకొస్తే గుండె బరువెక్కుతుంది. పెరుగుతున్న ఆర్థిక అసమానతలు, దేశ సంపదంతా కొద్దిమంది దగ్గర కేంద్రీకృతం కావటం, కోట్లాది మందికి కనీసం ప్రాధమిక అవసరాలు కూడా దక్కని స్థితి. జల్‌, జమీన్‌, రోటీ, కపడ, మకాన్‌, విద్య, వైద్యం, ఉద్యోగం వంటి మౌలిక అవసరాలు ప్రజలకు దక్కలేదు. ఇది మన కండ్లముందు కనిపిస్తున్న దృశ్యం. ఏడున్నర దశాబ్దాల స్వతంత్ర భారతం అంగీకరించి తీరాల్సిన చేదునిజం.
రాజకీయ పార్టీలు మారుతున్నాయి. నాయకులూ మారుతున్నారు. కానీ ప్రజల బతుకులు మారటం లేదు. సామాన్యుడు బతుకుపోరులో నిత్యం ఓడిపోతూనే ఉన్నాడు. నాటి ఇందిరా నినాదం ‘గరీబీ హఠావో’ మొదలు నేటి మోడీ నినాదం ‘సబ్‌ కా సాద్‌ సబ్‌కా వికాస్‌” వరకు ఆకర్షణీయ నినాదాలే తప్ప ప్రజలకు జరిగేదేమీ లేదు. ప్రపంచంలోనే పౌషకాహారం లభించని జనాభా భారతదేశంలోనే అధికంగా ఉన్నదని ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ తేల్చి చెప్పింది. మన జనాభాలో 14.5శాతం జనాభాకు పోషకాహారం అందటం లేదని, 19కోట్ల మంది ప్రతిరోజూ ఆకలితో నిద్రిస్తారని, ఐదేండ్లలోపు వయస్సున్న మన పిల్లలు 25శాతం మంది తక్కువ బరువుతో ఉన్నారని నివేదికలు చెబుతున్నాయి. పోషకాహార లోపంతో ఉంటూ వ్యాధుల భారిన పడుతున్నారని, కొందరు మరణిస్తున్నారని సంస్థల గణాంకాలు పేర్కొంటున్నాయి. మోడీ ప్రభుత్వం శివాజీ విగ్రహనికి పెడుతున్న ఖర్చు రూ.3,600కోట్లు కాగా, పిల్లల పోషకాహారం కోసం పెడుతున్న ఖర్చు 126కోట్లు అంటే విగ్రహాలకు ఇస్తున్న ప్రాధాన్యత ఈ దేశ భావిపౌరులకు లేదన్నమాట.
దేశంలో పట్టణ పేదల బతుకులు నానాటికి దుర్భరమవుతున్నాయి. ప్రభుత్వాలు, విద్య, ప్రజారోగ్యం, ఉపాధి రంగాలకు తగిన కేటాయింపులు చేయనందున సామాన్య ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం అందటం లేదు. నిప్పులు చిమ్ముతూ నింగికి దూసుకెళుతున్న రాకెట్లు, వాయువేగంతో పరుగులెడుతున్న బుల్లెట్‌ రైళ్లు, వైఫై హంగులతో మిరుమిట్లు గొలుపుతున్న ఆకాశ హార్మ్యాలు మోడీ, కేంద్ర మంత్రులు పలుకుతున్న అభివృద్ధి ప్రగల్భాలు. ఇవన్నీ ఉత్తర కుమార ప్రగల్బాలేనని గణాంకాలు, సర్వేలు తెలియ జేస్తున్నాయి. దేశ వాస్తవ ఆర్థిక స్థితి సంక్షోభంలో ఉందని, అంతులేని అరాచకం… తిరోగమనంలో ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక నేరస్తులకే ‘అచ్చేదిన్‌’ అని దేశంలో మెజారిటీ ప్రజానీకం మనోగతం కూడా ఇదేనని రిజర్వుబ్యాంకు ఇటీవల నిర్వహించిన వినియోగదారుల విశ్వాస సర్వే తేల్చి చెప్పింది. భారతదేశంలో 69శాతం ప్రజానీకం గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. 60శాతం పైగా ప్రజలు మన ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన వ్యవసాయరంగంపై ఆధారపడి ఉన్నారు. 1991 నుంచి అమలులోకి వచ్చిన ప్రపంచీకరణ (సరళీకరణ) విధానాల వలన వ్యవసాయరంగం క్రమేపీ సంక్షోభంలోకి నెట్టబడుతోంది. లక్షల సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దేశం క్రమంగా ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌ల కబంధ హస్తాల్లోకి కూరుకుపోయింది. ఫలితంగా విదేశీ బహుళ జాతి సంస్థలు, మరోవైపు దేశీయ కార్పొరేట్లు రైతును నిలువునా దోచేస్తున్నారు. కౌలు దారులు, వ్యవసాయ కూలీలకు పనులులేక పస్తులతో పొట్ట చేతపట్టుకొని సొంత ఊర్లు వదిలి, పట్టణాలకు వలసపోయి అడ్డకూలీలుగా మారి అర్థాకలితో పట్టణ మురికివాడల్లో కునారిల్లు తున్నారు.
హిందూ, ముస్లింల మధ్య విద్వేషాన్ని రాజేయటం ద్వారా మోడీ సర్కార్‌ ఈ ఆర్థిక సంక్షోభ సవాళ్లను కప్పిపుచ్చుకోవాలని చూస్తోంది. కాబట్టి ఈ విద్వేష రాజకీయ కుట్రలను ప్రజలు సమగ్రంగా అర్థం చేసుకోవాలి. ఈ విషయాలన్ని తెరచిచూస్తే ఈ దేశ ప్రజలకు నిజమైన స్వేచ్ఛ, స్వతంత్య్రాలు రాలేదనేది వాస్తవం. నిజానికి భారతదేశం పేదదేశం కాదు. కానీ తీరని దారిద్య్రం అనుభవిస్తున్న పేద ప్రజల దేశం. అపారమైన వనరులు, జీవనదులు, కష్టించి పనిచేసే ప్రజలు ఉండి కూడా ఈ దేశం ఇంత వెనుకబడి ఉండటానికి ప్రధాన కారణం ప్రజలకు కావలసిన రాజకీయ, ఆర్థిక వ్యవస్థలు ఇక్కడ మొదటి నుండి లేకపోవటం. ప్రజలకు కావలసిన ప్రజా ప్రత్యామ్నాయ విధానాలు ఇక్కడ అభివృద్ధి కావాలి. ప్రగతిశీలక శక్తులు, చోదక శక్తులైన రైతాంగం, కార్మిక, విద్యార్థి శక్తులను ఒక్కతాటిమీదకు తెచ్చి ప్రజల్ని ఎడ్యుకేట్‌ చేసుకుని, మరో నూతన స్వాతంత్య్ర పోరాటం ద్వారా మనిషిని మనిషి దోచుకొని, వ్యక్తిగత ఆస్తికి తావులేని నవభారత్‌ను నిర్మించుకోవాలి.
ఎల్‌. అరుణ
9705450705

Spread the love