పౌరసత్వ చట్టానికి వక్ర భాష్యాలు

2019 జనవరి 8న పార్లమెంట్‌లో పౌరసత్వ చట్టానికి సవరణ ఆమోదం పొందింది. దీని ప్రకారం విదేశాల నుండి వచ్చిన మైనార్టీలకు పౌరసత్వం కల్పించడానికి సవరణ చేసింది. ముస్లిం వలసదారులను మినహాయిస్తూ, ఆప్ఘనిస్తాన్‌, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ నుండి వచ్చిన హిందూ, క్రైస్తవ, సిక్కు, బౌద్ద, జైన, పార్శిలకు మాత్రమే పౌరసత్వం కల్పించటానికి సవరణ చట్టం తీసుకొచ్చారనేది స్పష్టం. భారత రాజ్యాంగంలోని అర్టికల్‌ 16, 58, 66, 124, 217 ప్రకారం ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950లోని సెక్షన్‌ 16 ప్రకారం పౌరసత్వం ఇవ్వొచ్చు. కానీ ఇందుకు విరుద్ధంగా బీజేపీ కొన్ని అంశాలకే చట్ట సవరణ చేసింది. పార్లమెంట్‌ ఆమోదించిన చట్టాన్ని అమలు చేయబోమని పన్నెండు రాష్ట్రాలు ప్రకటించడాన్ని కేంద్ర బీజేపీ ప్రభుత్వం జీర్ణించుకోలేక పోతున్నది. పార్లమెంట్‌లో మెజార్టీ ఉన్నదని చట్టాలు చేసినంత మాత్రన భారతదేశంలోని లౌకికతత్వాన్ని, భిన్నత్వంలోని ఏకత్వాన్ని మార్పు చేయడం సాధ్యం కాదు. పౌరసత్వ చట్టానికి చేసిన సవరణలో మయన్మార్‌ నుండి వచ్చిన రోహింగ్యా ముస్లింలకు, శ్రీలంక తమిళులకు, నేపాల్‌, భూటాన్‌ నుండి వలసొచ్చిన వారికి మాత్రం పౌరసత్వం వర్తింప చేయలేదు.
ఇక భారత్‌-పాకిస్థాన్‌కు జరిగిన ఒప్పందాలను వక్రీకరిస్తూ ఈ మధ్య అభూతకల్పనలు ప్రచారం చేస్తున్నారు. భారత ప్రధాని నెహ్రూ, పాకిస్థాన్‌ ప్రధాని లియాఖత్‌ ఒప్పందాన్ని కూడ వక్రీకరించారు. 1950 ఏప్రిల్‌ 8న ఇరు ప్రధానుల మధ్య పది అంశాలతో ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం ప్రకారం తమ తమ రాజ్యాంగంలో మార్పులు చేసుకుంటున్నట్లు ఇద్దరు ప్రధానులు ప్రకటించారు. “The Prime Minisiter of India has drawn attention to the fact that these rights are guaranteed to all minorities in India by its Constitution. The Prime Minister of Pakistan has pointed out that similar provision exists in the Objectives Resolution adopted by the Constituent Assembly of Pakistan” అని ఒప్పందంలో ఉంది. దీన్ని కూడా వక్రీకరించారు. ఒప్పందం ప్రకారం తూర్పు బెంగాల్‌, పశ్చిమ బెంగాల్‌, అస్సాం, త్రిపురలో జరిగిన మత ఘర్షణల కారణంగా చాలా మంది వలసబాట పట్టారు. వలసలు వెళ్ళినవారి స్థిర చర ఆస్తులను మరొకరు ఆక్రమించకూడదని 1950 డిసెంబర్‌ 31లోపు వచ్చిన వారికి తిరిగి వారి ఆస్తులు అప్పగించాలని ఒప్పందంలో ఉంది. ‘రెండు దేశాలలో మైనార్టీ కమిషన్లు ఏర్పాటు చేయాలి. ఆ మైనార్టీ కమిషన్ల అనుమతితో తిరిగొచ్చిన వారికి పునరావాసం కల్పించాలి. ఇరు దేశాల మంత్రులు చైర్మన్‌లుగా ఒక మెజార్టీ, ఒక మైనార్టీ వ్యక్తులను ఆ కమిషన్లలో వేయాలి. రెండు దేశాల మైనార్టీ కమిషన్లు వీలును బట్టి చర్చించుకుని వలసదారుల సమస్యలను పరిష్కరించాలి. దొంగిలించబడిన ఆస్తులను రికవరీ చేయడానికి అన్ని అవకాశాలను వినియోగించాలి. వలసొచ్చిన వారికి ఎలాంటి ఇబ్బంది కలుగకుండా వారు అంగీకరించిన దేశంలో పౌరసత్వ హక్కులు కల్పించాలి’ అని ఒప్పందంలో అంగీకరించారు. దాని ప్రకారమే 1955 పౌరసత్వ చట్టం రూపొం దింది. పౌరసత్వ చట్టం అమలులోకి వచ్చిన తరువాత 1971లో బంగ్లాదేశ్‌ స్వాతంత్య్రం పొందిన సందర్భంగా దాదాపు 1.20కోట్ల మంది వలసలు వెళ్ళారు. బంగ్లాదేశ్‌ విముక్తికి భారత సైన్యాలు సహకరించాయి. ఆ సందర్భంగా వలసొచ్చిన వారిని తిరిగి వారి ప్రదేశాల్లోకి పంపటానికి ప్రధాని ఇందిరాగాంధీ, బంగ్లాదేశ్‌ ప్రధాని ముజిబుర్‌ రెహ్మాన్‌ మధ్య 1972 మార్చి 19న ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందంలో పన్నెండు అంశాలను అంగీకరిస్తూ రెండు దేశాల మధ్య స్నేహ సంబంధాలను కొనసాగించాలని నిర్ణయించారు. ఈ ఒప్పందం పాతిక సంవత్సరాలు అమలులో ఉంటుందని ఆ తరువాత ఇరు దేశాల అభిప్రాయాలను బట్టి పొడిగించుకోవచ్చని అంగీకరించారు.
సుప్రీం తీర్పునకు వ్యతిరేక నిర్ణయం
1971లో పెద్ద ఎత్తున బంగ్లాదేశ్‌ నుండి అస్సాంలోకి వలసలు రావడంతో అస్సాంలోని విద్యార్థి సంఘాలు అఖిల భారత అస్సాం విద్యార్థి యూనియన్‌, విద్యార్థి గణపరిషత్‌ సంఘం కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేశాయి. ఆ సందర్భంగా పౌరసత్వ చట్టం 1955కు సవరణ చేస్తూ 1971 మార్చి 24కు ముందు వచ్చిన వారికి పౌరసత్వం కల్పిస్తూ చట్ట సవరణ చేశారు. అంతకుముందే 1966 జనవరి ఒకటికి ముందు అస్సాంలోకి వచ్చిన వారికి ఆటోమెటిక్‌గా పౌరసత్వం లభిస్తుంది. ఈ పౌరసత్వాన్ని రుజువు చేసుకోవడానికి అస్సాం ప్రజలకు ఎన్‌ఆర్‌సి (నేషనల్‌ రిజిష్టర్‌ సర్టిఫికేట్‌) సర్వే చేశారు. ఆ సందర్భంగా ”ఇల్లిగల్‌ మైగ్రైంట్స్‌ డిటర్మినేషన్‌ బై ట్రిబ్యునల్‌ యాక్ట్‌” చట్టం చేశారు. సుప్రీంకోర్టు 2005లో తీర్పునిస్తూ పౌరసత్వ ప్రక్రియ రిజిష్టర్‌ను దేశ వ్యాప్తంగా చేపట్టవద్దని అస్సాం ప్రాంతానికే (ఈశాన్య రాష్ట్రాలకే) పరిమితం చేయాలని స్పష్టంగా ఆదేశించింది. కానీ ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం భారతదేశానికి వర్తింపచేస్తూ తీసుకున్న నిర్ణయం సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా ఉంది. సరిహద్దులో ఉన్న బంగ్లాదేశ్‌ నుండి వలస వచ్చిన వారు 14 సర్టిఫికేట్‌లలో ఏదో ఒకదాని ఆధారంగా తమ పౌరసత్వాన్ని రుజువు చేసుకోవాలని కోరారు. భారత్‌కు వలస వచ్చిన వారిలో ముస్లింలు, హిందువులు, క్రైస్తవులతో పాటు అనేక మతాల వారు స్థిరపడ్డారు. 2004లో పౌరసత్వాన్ని చట్ట సవరణ జరిగిన దానిని సుప్రీంకోర్టు రద్దు చేయలేదు. 1983లో తెచ్చిన ఐఎండిటి (ఇల్లీగల్‌ మైగ్రైంట్స్‌ డిటర్మినేషన్‌ బై ట్రిబ్యునల్‌ యాక్ట్‌) చట్టాన్ని చెల్లదని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇది చారిత్రక వాస్తవం కాగా ఒకే దేశం, ఒకే జాతి, ఒకే మతం, ఒకే భాషా పేరుతో ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం పౌరసత్వ రాజ్యాంగ సవరణలకు పూనుకుంది. ఇందులో భాగంగా రాజ్యాంగం ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తూ కాశ్మీర్‌కు ఇచ్చిన రిజర్వేషన్లను తోసిపుచ్చి కాశ్మీర్‌-లడక్‌ రాష్ట్రాలుగా విభజన చేసింది. 35ఎ చట్టాన్ని కూడా రద్దు చేసింది. పదకొండు సంవత్సరాలుగా వలస ఉన్న వారిని ఆరేండ్లకు కుదిస్తూ బీజేపీ ప్రభుత్వం సవరణ చేసింది. 18 సెక్షన్లతో ఉన్న పౌరసత్వ చట్టం 1953 డిసెంబర్‌ 30న రూపొందింది. దానికి సవరణలు చేస్తూనే అస్సాంతో ముడిపడిన సమస్యను భారతదేశానికి వర్తింపజేసి 2021 జనాభా లెక్కలలో ”జాతీయ ప్రజారిజిష్టర్‌ను” రూపొందించటానికి ఆదేశించారు. మొత్తం భారతదేశంలోని ప్రజలందరు హిందూవులేనంటూ ఈ మధ్య హైదరాబాద్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత మోహన్‌ భగవత్‌ ప్రకటించారు.
‘ఘర్‌ వాపసీ’ పేరుతో నిర్భందం
కానీ భారత దేశంలో 14 ప్రధాన జాతులు, 300పైగా చిన్న జాతులు కలిసి ఉంటున్న వాస్తవాన్ని బీజేపీ గుర్తించడం లేదు. జాతుల కలయికతో ఏర్పడిన భారత ఫెడరేషన్‌ రాష్ట్రాల సమాఖ్యగా రాజ్యాంగం రూపొందిం చుకొని 1950 జనవరి 26 నుండి అమలు జరుపుతున్నది. ఆ రాజ్యాంగం ప్రకారం భారతదేశంలోని వారంతా సమాన హక్కును పొందాలని అంగీకరించారు. కానీ బీజేపీ ప్రభుత్వం హిందూ మతం వారు మాత్రమే ఉండాలని, ఇతర మతాలలోని వారు ”ఘర్‌ వాపసి” నినాదంతో హిందూ మతంలోకి రావాలని నిర్భందంగా ప్రచారం చేస్తున్నారు. భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్న భారతదేశ లౌకిక విధానానికి భంగం కలిగే విధంగా రాజ్యాంగ సవరణలకు బీజేపీ ప్రభుత్వం పూనుకుంది. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను క్రమంగా రద్దు చేస్తూ అర్టికల్‌ 371ని కూడా రద్దు చేసే అవకాశం కనబడుతున్నది. 371ఏ నుండి జె వరకు నాగాలాండ్‌, అస్సాం, మణిపూర్‌, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, సిక్కిం, మిజోరాం, అరుణాచల్‌ప్రదేశ్‌, గోవా రాష్ట్రాలకు రక్షణ కల్పించారు. 370 రద్దుతో కాశ్మీర్‌లో నేటికి ఐదు వేల మంది జైళ్ళలోనో, గృహ నిర్భందంలోనో ఉంటున్నారు. దేశ సమగ్రతను కాపాడాలని ఆందోళనలు చేస్తున్న ప్రజలపై పెద్దఎత్తున్న దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నారు. ప్రభుత్వ యాంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. యూనివర్సి టీలలో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై భౌతికదాడులు చేస్తూ గాయపడిన వారిపైనే కేసులు పెడుతున్నారు. జామీయా మిలియా యూనివర్సిటీ, అలిఘడ్‌ ముస్లిం యూనివర్సిటీ, బెనార్స్‌ ముస్లిం యూనివర్సిటీలతో పాటు ఇతర యూనివర్సిటీలను ఆర్‌ఎస్‌ఎస్‌ వారు తమ లక్ష్యాలుగా పెట్టుకున్నారు.
జాతుల మధ్య వైరుధ్యాలు
అంబేద్కర్‌ను గౌరవిస్తూనే అతని నేతృత్వంలో ఆమోదించబడిన రాజ్యాంగానికి సవరణ తెచ్చి మూల విధానాన్ని మార్చడానికి చేస్తున్న ప్రయత్నాన్ని ప్రజలందరూ ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే భాషతోపాటు ఆహారపు ఆలవాట్లలో మార్పులకు ప్రయత్నిస్తున్నారు. సమైక్యంగా ఉన్న జాతుల మధ్య వైరుధ్యాలు సృష్టించి దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు. దేశంలో కొనసాగుతున్న ఆర్థిక మాంద్యం వల్ల నిరుద్యోగం, ఆకలి, దారిద్య్రం పెరిగిపోతున్నది. ఏటా 12,600మంది రైతులు మరికొన్ని వేల మంది పారిశ్రామిక కార్మికులు ఆత్మ హత్యలకు పాల్పడుతున్నారు. ప్రపంచంలోని 195 దేశాలలో భారత దేశం ఆకలి సమస్యలో చివరి స్థానంలో ఉంది. ప్రజలు తమ ఆర్థిక సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేస్తున్నారు. ఈ ఆందోళనలను తప్పుదారి పట్టించడానికి పౌరసత్వాన్ని ఎజెండాపైకి తెచ్చారు. రానున్న 4 సంవత్సరాలు మత సమస్యలను కేంద్రంగా చేసుకోవడం ద్వారా కాలం గడపవచ్చని కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఆశిస్తున్నది. తాను ప్రకటించిన 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ 2025 నాటికి సాధించలేమన్న వాస్తవాన్ని గుర్తించి ప్రజలను ఈ వైపునకు ఆలోచించకుండా తప్పుదారి పట్టిస్తున్నారు. వ్యవసాయ రంగం 2.1 వృద్ధిరేటుతో ఉండగా మొత్తం జీడీపీ4.5శాతం వృద్ధి రేటు ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటిస్తున్న ప్పటికీ ఆర్థిక నిపుణులు అరవింద్‌ సుబ్రమణ్యం చెప్పినట్లు ”ప్రభుత్వం చేప్పే వృద్ధిరేటు” వాస్తవం కాదని సోదా హరణంగా వివరించారు. ఆర్థికవేత్తలందరూ ప్రభుత్వ ఆర్థిక విధానాలను తీవ్రంగా విమర్శిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మత సమస్యను కేంద్ర బిందువుగా చేసి ప్రజల కోర్కెలను వక్రమార్గం పట్టించే పనిలో పడ్డారు. అనేక అనుభవాలు ఉన్న భారత ప్రజానీకం ఈ తాత్కాలిక మళ్లింపులకు లొంగదన్న వాస్తవాన్ని కేంద్ర బీజేపీ పాలకులు గుర్తించడం మంచిది.

సారంపల్లి మల్లారెడ్డి
9490098666

Spread the love